దేశాలు వేరు.. సంస్కృతులు వేరు.. కానీ ప్రేమకు అవేవీ అడ్డంకులు కాలేదు. దాదాపు తొమ్మిదేళ్ల క్రితం యూకేలో చట్టబద్ధంగా ఒక్కటైన ఓ జంట, ఇప్పుడు కేరళలోని ప్రసిద్ధ గురువాయూర్ ఆలయంలో హిందూ సంప్రదాయ పద్ధతిలో మరోసారి వివాహ బంధంతో ఒక్కటైంది. స్కాట్లాండ్ పార్లమెంట్ సభ్యుడు మార్టిన్ డే, కేరళకు చెందిన నిధిన్ చంద్ల వివాహ వేడుక ప్రస్తుతం సోషల్ మీడియాలో ప్రత్యేకంగా నిలుస్తోంది.
మంగళవారం ఉదయం 11 గంటల సమయంలో గురువాయూర్ ఆలయంలో కుటుంబ సభ్యులు, సన్నిహితుల సమక్షంలో ఈ వేడుక జరిగింది. కేరళ సంప్రదాయాలను పాటిస్తూ జరిగిన ఈ వివాహానికి సంబంధించిన వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారాయి.
తొమ్మిదేళ్ల క్రితమే పెళ్లి.. అయినా ఆ కోరిక మిగిలింది
నిధిన్ చంద్కు గురువాయూర్ ఆలయంలో సంప్రదాయబద్ధంగా వివాహం చేసుకోవాలన్నది చాలాకాలంగా ఉన్న కోరిక. అయితే తొమ్మిదేళ్ల క్రితమే మార్టిన్ డే, నిధిన్లు యూకేలో చట్టబద్ధంగా వివాహం చేసుకున్నారు. వివిధ కారణాలతో ఆలయంలో పెళ్లి చేసుకునే అవకాశం ఇన్నాళ్లూ రాలేదు.
మార్టిన్ డే గతంలో 2018, 2019, 2023 సంవత్సరాల్లో కేరళకు వచ్చినప్పటికీ.. వరదలు, కరోనా పరిస్థితులు, కుటుంబ సభ్యుల అనారోగ్యం వంటి కారణాలతో గురువాయూర్ ఆలయానికి వెళ్లడం సాధ్యపడలేదు. తాజాగా కేరళ పర్యటనలో ఆ కోరికను నెరవేర్చారు.
ఈ వేడుకలో నిధిన్ 22 ఏళ్ల కుమారుడు వేదిక్ శంకర్తో పాటు ఇరు కుటుంబాలకు చెందిన బంధువులు పాల్గొన్నారు.
యూకేలో మొదలైన పరిచయం.. ప్రేమగా మారిన బంధం
నిధిన్ చంద్ 2008లో ఉన్నత విద్య కోసం యూకే వెళ్లారు. ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్లో బీటెక్ పూర్తి చేసిన ఆమె.. ఐటీ మేనేజ్మెంట్లో మాస్టర్స్ డిగ్రీ అనంతరం పీహెచ్డీ కూడా పూర్తిచేశారు.
ఆ సమయంలో యూకేలో వీసా నిబంధనల్లో వచ్చిన మార్పుల కారణంగా నిధిన్కు ఇబ్బందులు ఎదురయ్యాయి. తన సమస్యను పార్లమెంటరీ కమిటీల దృష్టికి తీసుకెళ్లే క్రమంలో అప్పటి యూకే ఎంపీ మార్టిన్ డేతో ఆమెకు పరిచయం ఏర్పడింది.
2016 ఫిబ్రవరిలో ప్రారంభమైన వీరి పరిచయం కొద్దికాలానికే ప్రేమగా మారింది. మార్టిన్ డే నిధిన్కు తన మనసులోని మాట చెప్పగా.. అప్పటికే విడాకులు తీసుకుని తన కుమారుడి బాధ్యతను చూసుకుంటున్న నిధిన్ తొలుత ఆలోచించారు. అయితే మార్టిన్ ఆమెకు అండగా నిలవడంతో వారి బంధం మరింత బలపడింది.
మార్టిన్ తన కుటుంబ సభ్యులకు నిధిన్ను పరిచయం చేయగా.. వారు కూడా ఆమెను సాదరంగా స్వీకరించారు. ఆ తర్వాత వీరిద్దరూ యూకేలో వివాహం చేసుకున్నారు.
ఇప్పుడు నెరవేరిన గురువాయూర్ కల
వివాహం జరిగినా.. కేరళలోని గురువాయూర్ ఆలయంలో హిందూ సంప్రదాయ పద్ధతిలో పెళ్లి చేసుకోవాలన్న నిధిన్ కోరిక మాత్రం అలాగే ఉండిపోయింది. పలుమార్లు ప్రయత్నించినప్పటికీ పరిస్థితులు అనుకూలించలేదు. చివరకు తాజా కేరళ పర్యటనలో ఆ కల సాకారమైంది.
ప్రస్తుతం నిధిన్ మేనేజ్మెంట్ కన్సల్టెంట్గా పనిచేస్తున్నారు. ఆమె కుమారుడు వేదిక్ శంకర్ ఎడిన్బర్గ్లో సీనియర్ డేటాబేస్ అడ్మినిస్ట్రేటర్గా పనిచేస్తున్నట్లు సమాచారం.
మార్టిన్ డే ఇప్పటికే మూడుసార్లు యూకే పార్లమెంట్ సభ్యుడిగా పనిచేశారు. ప్రస్తుతం స్కాటిష్ పార్లమెంట్ సభ్యుడిగా ప్రజా జీవితంలో కొనసాగుతున్నారు. విభిన్న నేపథ్యాలకు చెందిన ఈ జంట గురువాయూర్లో సంప్రదాయ పద్ధతిలో మరోసారి వివాహం చేసుకోవడం ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.
also read: జానీ మాస్టర్కు మరోసారి షాక్.. నిషేధం కొనసాగింపుపై ఫిల్మ్ ఫెడరేషన్ కీలక నిర్ణయం
