మహారాష్ట్రలో వైద్యుల నిర్లక్ష్యంపై తీవ్ర ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి. ప్రసవం కోసం ప్రభుత్వ ఆస్పత్రికి వెళ్లిన ఓ గర్భిణికి శస్త్రచికిత్స అనంతరం కడుపులో గ్లోవ్స్, టిష్యూ మిగిల్చిన ఘటన కలకలం రేపుతోంది.
ఆగస్టు 1న సంధ్యా సురాజ్ అనే గర్భిణికి ప్రభుత్వ ఆస్పత్రిలో ప్రసవం జరిగింది. సర్జరీ అనంతరం వైద్యులు కుట్లు వేశారు. అయితే కొన్ని రోజులకే ఆమెకు తీవ్రమైన కడుపునొప్పి మొదలైంది. నొప్పి తగ్గకపోవడంతో కుటుంబ సభ్యులు ఆమెను పుణేలోని మరో ఆస్పత్రికి తరలించారు.
అక్కడ వైద్యులు పరీక్షలు నిర్వహించగా అసలు విషయం బయటపడినట్లు సమాచారం. గతంలో జరిగిన శస్త్రచికిత్స సమయంలో గ్లోవ్స్, టిష్యూ వంటి వస్తువులు కడుపులోనే మిగిలిపోయినట్లు గుర్తించినట్లు కుటుంబ సభ్యులు ఆరోపించారు.
ఈ ఘటనపై సంధ్యా కుటుంబ సభ్యులు అధికారులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదును పరిశీలించిన అధికారులు ఆపరేషన్ చేసిన వైద్యుడితో పాటు సంబంధిత సిబ్బందికి నోటీసులు జారీ చేసినట్లు తెలుస్తోంది.
వైద్యుల నిర్లక్ష్యమే ఈ పరిస్థితికి కారణమా? అసలు శస్త్రచికిత్స సమయంలో ఏం జరిగింది? అనే అంశాలపై అధికారులు విచారణ చేపడుతున్నారు. విచారణ పూర్తయిన తర్వాత మరిన్ని వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది.
also read: రజినీకాంత్ జైలర్ 2 నుంచి అదిరిపోయే అప్డేట్.. ఫస్ట్ సింగిల్ ఎప్పుడంటే?
