అసోంలో మరోసారి ఎన్డీయే ప్రభుత్వం ఏర్పాటు కానుంది. బీజేపీ సీనియర్ నేత హిమంత బిశ్వ శర్మను అసోం ముఖ్యమంత్రిగా గవర్నర్ లక్ష్మణ్ ప్రసాద్ ఆచార్య అధికారికంగా నియమించారు. అంతకుముందు జరిగిన సమావేశంలో బీజేపీ శాసనసభాపక్ష నేతగా, అలాగే ఎన్డీయే కూటమి నాయకుడిగా హిమంత శర్మ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అనంతరం తనకు మద్దతు ఇస్తున్న ఎమ్మెల్యేల జాబితాతో కలిసి ఆయన గవర్నర్ను లోక్భవన్లో కలిశారు.
ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించిన గవర్నర్
ఈ సందర్భంగా ప్రభుత్వం ఏర్పాటు చేయాలని గవర్నర్ హిమంత శర్మను ఆహ్వానించారు. దీంతో అసోంలో ఎన్డీయే కూటమి వరుసగా మూడోసారి అధికారంలోకి రానుంది. గత కొన్నేళ్లుగా రాష్ట్రంలో బీజేపీ బలమైన రాజకీయ ఆధిపత్యాన్ని కొనసాగిస్తోంది. హిమంత బిశ్వ శర్మ నాయకత్వంలో పార్టీ మరింత బలపడిందని బీజేపీ వర్గాలు చెబుతున్నాయి.
మంగళవారం నాడు సీఎం ప్రమాణ స్వీకారం
ఇక కొత్త ప్రభుత్వ ప్రమాణ స్వీకార కార్యక్రమం మంగళవారం ఖానాపారాలో ఘనంగా జరగనుంది. ఈ కార్యక్రమానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో పాటు పలువురు కేంద్ర మంత్రులు, వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు హాజరుకానున్నారు. భారీ స్థాయిలో ఏర్పాట్లు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు.
అసోంలో మళ్లీ ఎన్డీయే ప్రభుత్వం ఏర్పడటం బీజేపీకి ఈశాన్య భారతంలో మరో పెద్ద విజయంగా భావిస్తున్నారు. రాష్ట్ర అభివృద్ధి, మౌలిక వసతులు, పెట్టుబడులు, శాంతిభద్రతల విషయంలో తమ ప్రభుత్వం మంచి పని చేసిందని బీజేపీ నేతలు పేర్కొంటున్నారు. కొత్త ప్రభుత్వంతో అభివృద్ధి కార్యక్రమాలు మరింత వేగం పుంజుకుంటాయని వారు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. హిమంత బిశ్వ శర్మ మరోసారి ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టనున్న నేపథ్యంలో అసోం రాజకీయాల్లో కొత్త ఉత్సాహం కనిపిస్తోంది. రాష్ట్ర ప్రజలకు మెరుగైన పాలన అందించేందుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉంటుందని ఎన్డీయే నాయకులు చెబుతున్నారు.