విశాఖపట్నం, క్రైమ్మిర్రర్: ఉత్తర శ్రీలంక తీరంలోని నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం రానున్న 48 గంటల్లో మరింత బలపడనుంది. భారత వాతావరణ శాఖ, విపత్తుల నిర్వహణ సంస్థ అంచనా ప్రకారం.. రానున్న రెండు రోజుల్లో ఆగ్నేయ బంగాళాఖాతంలోకి ప్రవేశించి 16వ తేదీ తరువాత అక్కడ వాయుగుండంగా బలపడనుంది. వాయవ్య దిశ నుంచి బలమైన గాలులు వీస్తున్నందున అల్పపీడనం బంగాళాఖాతంలోనే తూర్పు వైపు పయనిస్తుందని ఇస్రో వాతావరణ నిపుణుడు తెలిపారు.
అల్పపీడన ప్రభావంతో అక్కడక్క వర్షాలు పడుతాయని పేర్కొన్నారు. 16వ తేదీ తరువాత వాయుగుండంగా మారనున్నందున అండమాన్ నికోబార్ దీవులు, అండమాన్ సముద్రం పరిసరాల్లోకి నైరుతి రుతుపవనాలు ముందుగానే ప్రవేశించేందుకు అనుకూల వాతావరణం ఏర్పడుతుందని నిపుణులు వెల్లడించారు. 17వ తేదీ నుంచి 2-3 రోజులపాటు దక్షిణ కోస్తా, రాయలసీమ, తెలంగాణ, ఉత్తర కర్ణాటకల్లో వడగాడ్పులు వీయడంతో ఉష్ణోగ్రతలు 45 డిగ్రీలకు అటుఇటుగా నమోదవుతాయన్నారు. సోమవారం కోస్తా, సీమల్లో ఎండ తీవ్రత, ఉక్కపోత కొనసాగాయి. వాతావరణ అనిశ్చితితో పలుచోట్ల వర్షాలు కురిశాయి.
అండమాన్కు రుతుపవనాలు…
ఈ నెల 17వ తేదీకల్లా అండమాన్ నికోబార్ దీవులు, అండమాన్ సముద్రం, దక్షిణ బంగాళాఖాతంలోకి నైరుతి రుతుపవనాలు ప్రవేశిస్తాయని భారత వాతావరణ శాఖ సోమవారం రాత్రి ప్రకటన విడుదల చేసింది. సాధారణంగా మే 20 నాటికి అండమాన్ నికోబార్ దీవులను రుతుపవనాలు తాకాలి.