లోన్ యాప్ నిర్వాహకుల వేధింపులు రోజురోజుకూ మితిమీరుతున్నాయి. రుణం తీసుకున్న వ్యక్తి ఈఎంఐ చెల్లించలేదనే కారణంతో కుటుంబ సభ్యులను టార్గెట్ చేస్తూ బెదిరింపులకు పాల్పడిన ఘటన హైదరాబాద్లోని బోడుప్పల్ ప్రాంతంలో వెలుగులోకి వచ్చింది.
బోడుప్పల్లో నివాసం ఉంటున్న ఓ మహిళ తన బంధువు కోసం లోన్ యాప్ ద్వారా రుణం తీసుకున్నట్లు సమాచారం. కొంతకాలంగా ఈఎంఐ చెల్లింపులు నిలిచిపోవడంతో.. లోన్ యాప్కు సంబంధించిన వ్యక్తులు ఆమెకు ఫోన్ చేసి డబ్బులు చెల్లించాలంటూ ఒత్తిడి చేయడం ప్రారంభించారు.
వారి వేధింపులు ఎక్కువ కావడంతో మహిళ ఓ దశలో సంబంధిత నంబర్ను బ్లాక్ చేసినట్లు తెలుస్తోంది. దీంతో మరింత దారుణంగా వ్యవహరించిన లోన్ యాప్ నిర్వాహకులు.. మహిళ పదో తరగతి చదువుతున్న కుమార్తె ఫొటోలను మార్ఫింగ్ చేసి ఆమెకు పంపినట్లు సమాచారం.
రుణం చెల్లించకపోతే మార్ఫింగ్ చేసిన ఫొటోలను సోషల్ మీడియాలో వైరల్ చేస్తామంటూ బెదిరించినట్లు బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనతో భయాందోళనకు గురైన ఆమె.. తనకు, తన కుమార్తెకు రక్షణ కల్పించాలని పోలీసులను ఆశ్రయించారు.
బాధితురాలి ఫిర్యాదు ఆధారంగా పోలీసులు ఘటనపై దర్యాప్తు చేపట్టినట్లు తెలుస్తోంది. లోన్ యాప్ల పేరుతో ఇలాంటి బెదిరింపులకు పాల్పడే వారిపై అప్రమత్తంగా ఉండాలని, అనుమానాస్పద రుణ యాప్లను వినియోగించవద్దని అధికారులు సూచిస్తున్నారు.
also read: కోడలు వేసిన ప్లాన్.. మామ దారుణ హత్య! CCTVతో బయటపడిన అసలు కథ
