అలహాబాద్ హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ యశ్వంత్ వర్మకు సుప్రీంకోర్టులో ఊరట లభించింది. ఆయనపై క్రిమినల్ కేసు నమోదు చేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్ను అత్యున్నత న్యాయస్థానం తిరస్కరించింది.
న్యాయవాది ఘన్శ్యామ్ ఉపాధ్యాయ్ దాఖలు చేసిన ఈ పిటిషన్పై జస్టిస్ పి.ఎస్. నరసింహ, జస్టిస్ అలోక్ అరాధేలతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా పిటిషన్ దాఖలు చేసిన తీరుపై ధర్మాసనం అసంతృప్తి వ్యక్తం చేసింది.
ప్రచారం పొందేందుకు, న్యాయ ప్రక్రియను దుర్వినియోగం చేసేలా పిటిషన్లు వేయడం సరికాదని కోర్టు వ్యాఖ్యానించింది. ఇలాంటి వ్యవహారాలతో న్యాయ వ్యవస్థపై భారం పెరుగుతుందని పేర్కొంది. ఇదే అంశంపై గతంలో దాఖలైన పిటిషన్ను కూడా కొట్టివేసిన విషయాన్ని ధర్మాసనం గుర్తు చేసింది.
కాగా, గత ఏడాది ఢిల్లీలోని జస్టిస్ యశ్వంత్ వర్మ నివాసంలో జరిగిన అగ్నిప్రమాదం సమయంలో నగదు కట్టలు కనిపించాయనే ఆరోపణలు అప్పట్లో తీవ్ర చర్చకు దారితీశాయి. ఈ పరిణామాల నేపథ్యంలో ఆయనపై పలు ఆరోపణలు వచ్చాయి. అనంతరం ఆయనను తొలగించే అంశంపై పార్లమెంట్లో అభిశంసన ప్రక్రియ ప్రారంభమైంది.
అయితే, ఈ పరిణామాల మధ్య జస్టిస్ యశ్వంత్ వర్మ తన న్యాయమూర్తి పదవికి రాజీనామా చేశారు. రాజీనామా చేసినప్పటికీ నేరపరమైన బాధ్యత నుంచి తప్పించుకోలేరని పిటిషనర్ వాదించారు.
ఈ వాదనలను పరిశీలించిన సుప్రీంకోర్టు.. పిటిషన్లో సరైన ఆధారాలు లేవని పేర్కొంటూ దాన్ని తిరస్కరించింది. న్యాయ ప్రక్రియను వ్యక్తిగత ప్రచారం కోసం ఉపయోగించకూడదని స్పష్టం చేసింది.
also read: డాబర్కు ఢిల్లీ హైకోర్టు ఊరట.. ‘100 శాతం’ క్లెయిమ్స్పై ఎఫ్ఎస్ఎస్ఏఐ ఆదేశాలకు తాత్కాలిక స్టే
