Homeఅంతర్జాతీయంIran Warning: 200 డాలర్లకు బ్యారెల్‌ ఆయిల్ ధర.. ఇరాన్ స్ట్రాంగ్ వార్నింగ్!

Iran Warning: 200 డాలర్లకు బ్యారెల్‌ ఆయిల్ ధర.. ఇరాన్ స్ట్రాంగ్ వార్నింగ్!

గల్ఫ్‌ దేశాలు అమెరికాను, దాని మిత్రదేశాలను కట్టడి చేయకుంటే అంతర్జాతీయ మార్కెట్ లో ఆయిల్ ధరలు బ్యారెల్‌ 200 డాలర్లకు ఎగబాకుతాయని ఇరాన్‌కు చెందిన ఇస్లామిక్‌ రివల్యూషనరీ గార్డ్‌ కార్ప్స్‌.. గల్ఫ్‌ దేశాలను హెచ్చరించింది. ఇరాన్‌ మౌలిక సదుపాయాలపై దాడులు ఇలాగే కొనసాగితే.. అంతర్జాతీయ మార్కెట్ లో ఇంధన సరఫరాపై నేరుగా ప్రభావం పడుతుందని తేల్చి చెప్పింది. బ్యారెల్‌ ముడిచమురు ధర 200 డాలర్లు దాటినా భరించగలమనుకుంటేనే ఈ దాడుల ఆటను ఇలా కొనసాగనివ్వాలని ఐఆర్‌జీసీ అధికార ప్రతినిధి ఎబ్రహీం జోల్ఫాఘడీ హెచ్చరించారు. సైనికచర్యల నిలిపివేతకు అమెరికా, ఇజ్రాయెల్‌పై ఒత్తిడి తేవాలని ఇస్లామిక్‌ దేశాలకు సూచించారు. తమ దేశంలోని పౌర మౌలిక సదుపాయాలపై జరుగుతున్న దాడులకు ఈ హెచ్చరిక తమ ప్రత్యక్ష స్పందన అని తెలిపారు. దాడులు ఇలాగే కొనసాగితే ప్రాంతీయంగా తాము కూడా అదే తరహా చర్యలు తీసుకుంటామని తేల్చిచెప్పారు.

మీ ఆయిల్ సరఫరాలను అడ్డుకుంటాం!

తమ ఆయిల్ క్షేత్రాలపై అమెరికా, ఇజ్రాయెల్‌ దాడులు జరిపితే.. చుట్టూ ఉన్న మిగతా దేశాల చమురు ఉత్పత్తి, సరఫరాను సైతం తాను అడ్డుకుంటామని ఇరాన్‌ తేల్చి చెప్పింది.  యుద్ధం మొదలైనప్పటి నుంచి పెరుగుతూ వస్తున్న ముడిచమురు ధరలు.. ఐఆర్‌జీసీ హెచ్చరికల నేపథ్యంలో సోమవారం భారీగా పెరిగాయి. కానీ.. జీ7 దేశాలు తమ వద్ద ఉన్న అత్యవసర నిల్వల నుంచి 300-400 మిలియన్‌ బ్యారెళ్ల చమురును మార్కెట్లోకి విడుదల చేస్తాయని ఫ్రెంచ్‌ ప్రెసిడెంట్‌ మేక్రాన్‌ వెల్లడించడంతో ధరలు మళ్లీ తగ్గాయి. బ్రెంట్‌, డబ్ల్యూటీఐ రకం ముడి చమురు ధరలు ఒక దశలో దాదాపు 119-120 డాలర్లకు చేరువై.. మళ్లీ 100-102 డాలర్లకు తగ్గాయి. కానీ, ఆ తర్వాత పరిస్థితి మారింది. జీ7 దేశాల ఆర్థిక మంత్రులు భేటీ అయి దీనిపై చర్చించి.. ప్రస్తుతానికి తమ వ్యూహాత్మక నిల్వలను వాడకూడదని నిర్ణయించుకున్నారు.

ఆయిల్ ధరల పెరుగుదలపై స్పందించిన ట్రంప్

అటు చమురు ధరల పెరుగుదలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ స్పందించారు. చమురు ధరల పెరుగుదల స్వల్పకాలికమే అన్నారు. ఇరాన్‌ అణు ముప్పును పూర్తిగా నిర్మూలించిన తర్వాత ధరలు వేగంగా తగ్గిపోతాయని చెప్పారు. అమెరికా, ప్రపంచ శాంతికి, భద్రతకు చెల్లించే స్వల్ప ధర ఇది అన్నారు.  మరోవైపు, అంతర్జాతీయ విపణిలో క్రూడాయిల్‌ ధరలు నానాటికీ భారీగా పెరిగిపోతున్న నేపథ్యంలో.. దేశంలో పెట్రోల్‌, డీజీల్‌ ధరలను ప్రభుత్వం పెంచేస్తుందేమోనన్న ఆందోళన చాలా మందిలో ఉంది. అయితే.. అలాంటి ఆలోచన ఏదీ ప్రస్తుతానికి లేదని తెలుస్తోంది.

Anjibabu Chittimalla
Anjibabu Chittimallahttps://crimemirror.com/
గత 15 సంవత్సరాలుగా మీడియా రంగంలో పని చేస్తున్నాను. ప్రస్తుతం ‘క్రైమ్ మిర్రర్’కు డిప్యూటీ ఎడిటర్ ఇన్ చీఫ్ గా విధులు నిర్వహిస్తున్నాను.

తాజావార్తలు