Opposition Unity: బెంగాల్, అస్సాం రాష్ట్రాల్లో బీజేపీ విజయాలు సాధించినప్పటికీ, దేశ రాజకీయాల్లో మరో వైపు కొత్త సమీకరణాలపై చర్చ మొదలైంది. ముఖ్యంగా 2029 సార్వత్రిక ఎన్నికల నాటికి ప్రతిపక్షాలు ఒక్కటయ్యే అవకాశం ఉందని కాంగ్రెస్ వర్గాలు భావిస్తున్నాయి. ఇండియా కూటమి మరింత బలపడే పరిస్థితులు కనిపిస్తున్నాయని అంచనా వేస్తున్నారు.
మమతా, స్టాలిన్ తో రాహుల్ చర్చలు!
బెంగాల్లో దెబ్బతిన్న మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్, అలాగే తమిళనాడులో ఓటమి చవిచూసిన ఎంకే స్టాలిన్ నేతృత్వంలోని డీఎంకే, భవిష్యత్తులో జాతీయ స్థాయిలో కాంగ్రెస్తో కలిసి పనిచేయాల్సిన పరిస్థితి రావచ్చని అంచనా వేస్తున్నారు. రాష్ట్రాల్లో ఎదురైన ఇబ్బందులు ఈ పార్టీలను కొత్త వ్యూహాల వైపు మళ్లించే అవకాశం ఉందని కాంగ్రెస్ నాయకులు భావిస్తున్నారు.
తాజా ఎన్నికల ఫలితాలు వచ్చిన వెంటనే లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, మమతా బెనర్జీ, స్టాలిన్లతో ఫోన్లో మాట్లాడటం రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది. అదే సమయంలో తమిళనాడులో గెలిచిన టీవీకే అధినేత విజయ్కు అభినందనలు తెలిపారు. ఇది భవిష్యత్తులో కొత్త రాజకీయ సమీకరణాలకు సంకేతంగా భావిస్తున్నారు.
మమతాలో మార్పు తప్పదా?
ఇప్పటి వరకు మమతా బెనర్జీ కాంగ్రెస్ను పెద్దగా పట్టించుకోలేదనే అభిప్రాయం ఉంది. కానీ తాజా పరిణామాలతో తృణమూల్ కాంగ్రెస్ జాతీయ స్థాయిలో తన స్థానాన్ని నిలబెట్టుకోవాలంటే కాంగ్రెస్తో కలిసి పనిచేయాల్సిన అవసరం ఏర్పడవచ్చని అంచనా వేస్తున్నారు. ఇదే విధంగా డీఎంకే కూడా తాజా ఓటమి తర్వాత కాంగ్రెస్తో సమన్వయం పెంచే దిశగా ఆలోచించవచ్చని భావిస్తున్నారు.
మరోవైపు, కేరళలో వామపక్షాలకు ఎదురైన పరాజయం కూడా జాతీయ రాజకీయాలపై ప్రభావం చూపనుంది. అక్కడ వారి బలం తగ్గడంతో, భవిష్యత్తులో వారు కూడా కాంగ్రెస్తో కలిసే అవకాశం ఉందని అంటున్నారు. ఈ మొత్తం పరిణామాలు చూస్తే, 2029 ఎన్నికల నాటికి ప్రతిపక్షాలు ఒకే వేదికపైకి వచ్చి బీజేపీని ఎదుర్కొనే పరిస్థితి ఏర్పడవచ్చని కాంగ్రెస్ వర్గాలు విశ్వసిస్తున్నాయి.