తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంపై మాజీ మంత్రి బీఆర్ఎస్ఎల్పీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీష్ రావు సంచలన ఆరోపణలు చేశారు. హ్యమ్ (HAM) మోడల్ రోడ్ల నిర్మాణ టెండర్లలో భారీ కుంభకోణం జరుగుతోందని ఆయన మండిపడ్డారు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో తాము హెచ్చరించినట్లుగానే ఇప్పుడు 25 శాతం అదనపు నిధులతో టెండర్లు ఖరారు చేస్తున్నారని ఆధారాలతో సహా వివరించారు. ఈ వ్యవహారం వల్ల ప్రభుత్వ ఖజానాపై సుమారు రూ. 5,000 కోట్ల అదనపు భారం పడుతుందని ఆవేదన వ్యక్తం చేశారు.
రోడ్లు భవనాల (R&B) శాఖలో రూ. 11,000 కోట్లకు టెండర్లు పిలిస్తే ఎక్సెస్ నిధులతో కలిపి ఆ మొత్తం రూ. 15,000 కోట్లకు చేరిందని హరీష్ రావు పేర్కొన్నారు. పంచాయతీ రాజ్ శాఖలో రూ. 6,000 కోట్ల పనులు కాస్తా రూ. 8,000 కోట్లకు పెరిగాయని చెప్పారు. ఇలా ప్రజా ధనాన్ని కొందరికి కట్టబెట్టేందుకు ప్రభుత్వం సిద్ధమైందని విమర్శించారు. ఒకే కంపెనీకి ఏకంగా 15 టెండర్లు దక్కబోతున్నాయని దీనికి సంబంధించిన పూర్తి వివరాలను త్వరలోనే బయటపెడతానని హెచ్చరించారు.
ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం అనుసరిస్తున్న మొబిలైజేషన్ అడ్వాన్సుల విధానంపై హరీష్ రావు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. గతంలో ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు సమయంలో ఇదే విధానాన్ని ధనయజ్ఞం అని విమర్శించిన రేవంత్ రెడ్డి ఇప్పుడు అదే పద్ధతిని అనుసరించడం ద్వంద్వ నీతికి నిదర్శనమని ఎద్దేవా చేశారు. 2014లో బీఆర్ఎస్ అధికారంలోకి రాగానే ఈ మొబిలైజేషన్ అడ్వాన్సుల విధానాన్ని రద్దు చేశామని గుర్తు చేశారు. తమ హయాంలో టెండర్ విలువ 5 శాతం కంటే ఎక్కువగా ఉంటే వెంటనే రీ-కాల్ చేసేవారమని ఇప్పుడు 25 శాతం అధికంగా ఉన్నా పట్టించుకోవడం లేదని ఆరోపించారు.
హ్యమ్ మోడల్ రోడ్ల కోసం 60 శాతం బ్యాంకు అప్పులు తెచ్చి 15 ఏళ్ల పాటు వడ్డీతో సహా చెల్లించే నిర్ణయం భవిష్యత్తు తరాలపై భారం మోపుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. రేవంత్ రెడ్డి ప్రత్యక్షంగా పరోక్షంగా రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెడుతున్నారని విమర్శించారు. పదవీ విరమణ చేసిన అధికారుల కాలపరిమితిని పొడిగించి మరీ ఈ టెండర్ల ప్రక్రియను కొనసాగిస్తున్నారని ఇది పారదర్శకతకు విరుద్ధమని పేర్కొన్నారు. వెంటనే ఈ ఎక్సెస్ టెండర్లను రద్దు చేసి పనులన్నింటికీ రీ-టెండర్లు పిలవాలని హరీష్ రావు డిమాండ్ చేశారు.
ప్రభుత్వం తన వైఖరి మార్చుకోకపోతే ప్రజా క్షేత్రంలో ఎండగడతామని ఆయన స్పష్టం చేశారు. పారదర్శకత గురించి మాట్లాడే ముఖ్యమంత్రి ఈ అదనపు కేటాయింపులపై ఎందుకు మౌనంగా ఉన్నారని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెట్టి కాంట్రాక్టర్లకు మేలు చేసే పద్ధతిని మానుకోవాలని హితవు పలికారు. ప్రజల సొమ్మును దుర్వినియోగం చేసే అధికారం ఎవరికీ లేదని ఆయన తేల్చి చెప్పారు. ఈ దోపిడీపై తాము రాజీలేని పోరాటం చేస్తామని వెల్లడించారు.
ALSO READ: కార్మికులపై కేసుల ఎత్తివేతకు ముఖ్యమంత్రి గ్రీన్ సిగ్నల్.. అధికారులకు కీలక ఆదేశాలు