తిరుపతి, క్రైమ్ మిర్రర్: తిరుపతి జిల్లాలో సోమవారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో నలుగురు మృతి చెందిన ఘటన ఆ ప్రాంతంలో విషాదం నెలకొంది. నాయుడుపేట – రేణిగుంట జాతీయ రహదారిపై శ్రీకాళహస్తి మండలం ఊరందూరు వద్ద ఆగి ఉన్న లారీని అంబులెన్స్ వేగంగా వచ్చి ఢీకొట్టింది. ఈ దుర్ఘటనలో అంబులెన్స్లో ప్రయాణిస్తున్న నలుగురు అక్కడికక్కడే దుర్మరణం చెందారు.
ఆగి ఉన్న లారీని ఢీకొన్న అంబులెన్స్…
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కోల్కతా నుంచి ఒక రోగిని మెరుగైన చికిత్స నిమిత్తం బెంగళూరులోని ఓ ఆస్పత్రికి అంబులెన్స్లో తరలిస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. జాతీయ రహదారిపై అప్పటికే నిలిపి ఉంచిన లారీని అంబులెన్స్ వెనుక నుంచి వచ్చి బలంగా ఢీకొట్టింది. ఢీకొన్న వేగానికి అంబులెన్స్ ముందు భాగం పూర్తిగా నుజ్జునుజ్జయ్యింది. ఈ ప్రమాదంలో అంబులెన్స్లో ఉన్న రోగితో పాటు ఆయనకు సహాయకులుగా ఉన్న మరో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. మృతులంతా పశ్చిమ బెంగాల్కు చెందిన వారని ప్రాథమిక సమాచారం. వీరి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
కాగా అంబులెన్స్ డ్రైవర్ తీవ్ర గాయాలతో ప్రాణాపాయ స్థితిలో ఉన్నట్లు తెలుస్తోంది. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు, పోలీసులు స్పందించి డ్రైవర్ను చికిత్స నిమిత్తం సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. సంఘటనా స్థలానికి చేరుకున్న శ్రీకాళహస్తి పోలీసులు మృతదేహాలను స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. జాతీయ రహదారిపై ట్రాఫిక్కు అంతరాయం కలగకుండా ప్రమాదానికి గురైన వాహనాలను తొలగించారు