
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇటీవల ప్రకటించిన ‘గోల్డ్ కార్డు’కు భారీ గిరాకీ కనిపిస్తోంది. ఒక్కరోజే 1000 కార్డులను విక్రయించినట్లు అమెరికా వాణిజ్యశాఖ మంత్రి వెల్లడించారు. వీటి ద్వారా 5బిలియన్ డాలర్లు సేకరించినట్లు తెలుస్తోంది. లక్షలాది మంది ఈ కార్డును కొనేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు. వీటిద్వారా 5 ట్రిలియన్ డాలర్లు సేకరించే అవకాశం ఉందని అమెరికా యంత్రాంగం చెబుతోంది. ప్రపంచ వ్యాప్తంగా 3.7 కోట్ల మందికి ఈ గోల్డ్ కార్డు కొనే సామర్థ్యం ఉందని అగ్రరాజ్యం చెబుతోంది. కనీసం 10లక్షల మందైనా ఈ కార్డును కొనుగోలు చేస్తారని అధ్యక్షుడు ట్రంప్ భావిస్తున్నట్టు సమాచారం.
ప్రస్తుతం ఉన్న ఇన్వెస్టర్ వీసా ఈబీ-5 స్థానంలో ఈ గోల్డ్ కార్డు తీసుకురానున్నట్లు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇటీవల ప్రకటించారు. 5 మిలియన్ డాలర్లు చెల్లించగలిగే వారికి నేరుగా అమెరికా పౌరసత్వాన్ని అందజేస్తామన్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సంపన్నులను ఆకర్షించేందుకే దీనిని ప్రవేశపెట్టామంటోంది. అమెరికాకు వచ్చి భారీగా ఖర్చుపెడితే స్థానికంగా ఉద్యోగాలు కూడా పెరుగుతాయని డొనాల్డ్ ట్రంప్ తెలిపారు. EB-5 ప్రోగ్రామ్ వల్ల జరుగుతున్న మోసాలు, ఇతర అక్రమాలను అరికట్టేందుకు వీటిని తీసుకొస్తున్నట్టు ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ తెలిపింది.
ఈబీ-5 వీసా విధానాన్ని అమెరికా 1990లో తీసుకొచ్చింది. వేలాది మంది ఈ ఇన్వెస్టర్ వీసాలను పొందారు. అయితే, ఈ విధానంతో మోసాలు జరుగుతున్నాయని, కొందరు అక్రమంగా నిధులు పొందుతున్నారని ఓ అధ్యయనంలో తేలింది. దీంతో 2022లో కొన్ని సవరణలు చేశారు. తాజాగా దీని స్థానంలో గోల్డ్ కార్డును ప్రవేశపెడుతున్నట్లు ట్రంప్ వెల్లడించారు.