మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలం అర్పణపల్లి గ్రామంలోని ఓ బావిలో మొసలి ప్రత్యక్షమవడంతో తీవ్ర కలకలం రేగింది. గ్రామానికి సమీపంలో ఉన్న వ్యవసాయ బావిలో ఈ భారీ వన్యప్రాణి కనిపించడంతో రైతులు, స్థానికులు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. రోజూ వెళ్లినట్టే పొలానికి పనుల నిమిత్తం వెళ్లిన రైతులు అక్కడి బావి లోపల పెద్ద మొసలిని గమనించారు. వెంటనే పరిస్థితిని అర్థం చేసుకున్న వారు అప్రమత్తమై అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు. అయితే సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకున్నప్పటికీ, మొసలిని పట్టుకోవడంలో ముందుకు రాకపోవడం స్థానికులను ఆందోళనకు గురిచేసింది.
ఇక ప్రమాదం మరింత పెరిగే అవకాశముందని భావించిన గ్రామ యువకులు, రైతులు కలిసి స్వయంగా చర్యలు చేపట్టారు. ఎంతో జాగ్రత్తగా, ప్రణాళికాబద్ధంగా వలలను ఉపయోగించి మొసలిని బంధించి బావి నుంచి బయటకు తీసుకొచ్చారు. ఈ క్రమంలో ఎలాంటి ప్రమాదం జరగకపోవడం విశేషం. గ్రామ సమీప ప్రాంతాల్లో వన్యప్రాణులు కనిపించడం ఇటీవలి కాలంలో పెరుగుతోందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పంటపొలాలు, జనావాసాలకు ఇలాంటి జంతువులు చేరుకోవడం భద్రతాపరమైన సమస్యగా మారుతోందని వారు చెబుతున్నారు. అటవీశాఖ అధికారులు తక్షణ చర్యలు తీసుకుని ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని గ్రామస్థులు కోరుతున్నారు.
also read: తెలంగాణలో మరో ఎయిర్ హబ్ – ఆదిలాబాద్ ఎయిర్పోర్ట్పై కీలక అప్డేట్