భారత్ ‘ఎ’ జట్టు యువ క్రికెటర్ వైభవ్ సూర్యవంశీపై బీసీసీఐ క్రమశిక్షణ చర్యలు తీసుకుంది. ఇటీవల శ్రీలంకలో జరిగిన ముక్కోణపు వన్డే సిరీస్లో శ్రీలంక ‘ఎ’ జట్టుతో జరిగిన మ్యాచ్ సందర్భంగా చోటుచేసుకున్న వివాదాస్పద ఘటన కారణంగా అతడికి జరిమానా విధించింది.
వైభవ్ మ్యాచ్ ఫీజులో 50 శాతం కోత
మ్యాచ్ రెఫరీ ప్రదీప్ జయప్రగాష్ సమర్పించిన నివేదిక ఆధారంగా వైభవ్ సూర్యవంశీ మ్యాచ్ ఫీజులో 50 శాతం కోత విధించినట్లు సమాచారం. అదే మ్యాచ్లో అంపైర్తో వాగ్వాదానికి దిగిన భారత ‘ఎ’ జట్టు కెప్టెన్ తిలక్ వర్మకు కూడా శిక్ష పడింది. అతడి మ్యాచ్ ఫీజులో 30 శాతం జరిమానా విధించారు.ఈ ఘటనలో శ్రీలంక ఆటగాళ్లు కూడా తప్పించుకోలేకపోయారు. శ్రీలంక ‘ఎ’ జట్టు ఆటగాడు విషేన్ హలంబెజ్కు మ్యాచ్ ఫీజులో 50 శాతం కోత విధించగా, మరో ఆటగాడు నిరోషన్ డిక్వెల్లాకు 20 శాతం జరిమానా విధించారు.
వైభవ్ ను రెచ్చగొట్టడంతో గొడవ
ఈ నెల 15న దంబుల్లాలో భారత్ ‘ఎ’, శ్రీలంక ‘ఎ’ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ ఉత్కంఠభరితంగా సాగింది. నిర్ణీత ఓవర్లలో ఫలితం తేలకపోవడంతో మ్యాచ్ సూపర్ ఓవర్కు వెళ్లింది. చివరకు సూపర్ ఓవర్లో శ్రీలంక ‘ఎ’ జట్టు విజయం సాధించింది. అయితే మ్యాచ్ ముగింపు సమయంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. సూపర్ ఓవర్లో అవుటై పెవిలియన్ వైపు వెళ్తున్న వైభవ్ సూర్యవంశీని ఉద్దేశించి శ్రీలంక ఆటగాడు విషేన్ హలంబెజ్ ఏదో వ్యాఖ్య చేసినట్లు తెలుస్తోంది. దీంతో ఆగ్రహానికి గురైన వైభవ్ అతడిని బలంగా నెట్టడంతో ఇరువురు ఆటగాళ్ల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. మైదానంలో జరిగిన ఈ ఘటనపై మ్యాచ్ అధికారులు నివేదిక సమర్పించగా, దాని ఆధారంగా సంబంధిత క్రికెట్ బోర్డులు చర్యలు తీసుకున్నాయి. ఆటలో క్రమశిక్షణ, క్రీడాస్ఫూర్తిని కాపాడేందుకు ఈ జరిమానాలు విధించినట్లు తెలుస్తోంది.