తమిళనాడు రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. బీజేపీ తమిళనాడు మాజీ అధ్యక్షుడు అన్నామలై పార్టీకి రాజీనామా చేసిన తర్వాత తన భవిష్యత్ రాజకీయ ప్రణాళికలను వెల్లడించారు. ఎక్కువ మంది ప్రజలను ఒకే వేదికపైకి తీసుకువచ్చే కొత్త రాజకీయ ఉద్యమాన్ని ప్రారంభించడమే తన లక్ష్యమని చెప్పారు.
అన్నామలై రాజీనామా ఆమోదం
శుక్రవారం ఆయన రాజీనామాను బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ ఆమోదించారు. అనంతరం ఢిల్లీలో ఉన్న అన్నామలై సోషల్ మీడియా ద్వారా తన నిర్ణయాన్ని ప్రకటించారు. ప్రస్తుతం ఉన్న రాజకీయ వ్యవస్థలో మార్పులు తీసుకురాగల కొత్త తరహా రాజకీయ ఉద్యమాన్ని ప్రారంభించాలని భావిస్తున్నట్లు తెలిపారు. ఈ విషయాన్ని బీజేపీ కేంద్ర నాయకత్వానికి ముందుగానే తెలియజేశానని చెప్పారు. పార్టీని వీడటం ఎలాంటి విభేదాలతో కాకుండా పరస్పర గౌరవంతో జరిగిందని అన్నామలై స్పష్టం చేశారు. 2009లో విజయకాంత్ స్థాపించిన డీఎండీకేలో మూడు నెలలు శిక్షణ పొందిన తర్వాత, దాదాపు పదేళ్లకు బీజేపీలో చేరానని గుర్తుచేశారు. గత ఆరు సంవత్సరాలుగా పార్టీ కోసం పనిచేశానని చెప్పారు.
మోదీ నాయకత్వం దేశానికి అవసరం
ప్రధాని నరేంద్ర మోదీపై తనకు అపార గౌరవం ఉందని, దేశానికి ఆయన నాయకత్వం అవసరమని పేర్కొన్నారు. అయితే గత 18 నెలలుగా పార్టీలో కొన్ని సమస్యలు ఎదురయ్యాయని, వాటిని పలుమార్లు పార్టీ అధిష్ఠానానికి వివరించినట్లు తెలిపారు. తాను బీజేపీని వీడాలనే నిర్ణయాన్ని గత ఏడాది డిసెంబర్లోనే నాయకత్వానికి తెలియజేశానని చెప్పారు. అయితే అసెంబ్లీ ఎన్నికల వరకు వేచి ఉండాలని సూచించడంతో మే నెలాఖరు వరకు పార్టీ బాధ్యతలు నిర్వహించినట్లు వెల్లడించారు.
వచ్చే లోక్ సభ ఎన్నికల్లో పోటీ
త్వరలోనే కొత్త రాజకీయ ఉద్యమాన్ని ప్రారంభిస్తానని, వచ్చే లోక్సభ ఎన్నికల్లో పోటీ చేయడం ఖాయమని అన్నామలై ప్రకటించారు. ఈ ఉద్యమానికి మద్దతుగా కోయంబత్తూరులో మాజీ రాష్ట్రపతి డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం పేరుతో సెంటర్ ఫర్ ఎతిక్స్ అండ్ పాలిటిక్స్ అనే సంస్థను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. అటు, తమిళనాడు బీజేపీ ఉపాధ్యక్షుడు కరు నాగరాజన్, రాష్ట్ర కార్యదర్శి సుమతి వెంకటేశ్ కూడా పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. దీంతో రాష్ట్ర బీజేపీలో అంతర్గత పరిస్థితులపై రాజకీయ వర్గాల్లో చర్చ మొదలైంది. అన్నామలైకి తమ మద్దతు ఉంటుందని నాగరాజన్ వెల్లడించారు.