ఆంధ్రప్రదేశ్లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం అమలులోకి వచ్చిన తర్వాత ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణికుల రద్దీ గణనీయంగా పెరిగింది. ప్రతిరోజూ వేలాది మంది మహిళలు ఈ పథకాన్ని వినియోగించుకుంటూ వివిధ ప్రాంతాలకు ప్రయాణిస్తున్నారు. అయితే పెరిగిన రద్దీని అవకాశంగా మార్చుకున్న కొందరు మహిళా దొంగల ముఠాలు ఇప్పుడు ప్రయాణికులను లక్ష్యంగా చేసుకుని చోరీలకు పాల్పడుతున్నాయి. ముఖ్యంగా రద్దీగా ఉండే బస్సుల్లో మహిళా ప్రయాణికుల హ్యాండ్ బ్యాగులు, నగలు, విలువైన వస్తువులను చాకచక్యంగా అపహరిస్తూ ఆందోళన కలిగిస్తున్నాయి. ఈ నేపథ్యంలో తిరుపతి జిల్లా పోలీసులు మహిళా ప్రయాణికులను అప్రమత్తం చేస్తూ పలు సూచనలు జారీ చేశారు.
ఇటీవల పాకాల ప్రాంతంలో ఆర్టీసీ బస్సుల్లో వరుసగా చోరీలు జరుగుతున్నాయని ఫిర్యాదులు అందడంతో పోలీసులు ప్రత్యేక దృష్టి సారించారు. మహిళా ప్రయాణికుల బ్యాగుల నుంచి బంగారు ఆభరణాలు మాయమవుతున్న ఘటనలు పెరగడంతో నిందితులను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. పాకాల సీఐ చిన్న గోవిందు పర్యవేక్షణలో పనిచేసిన ప్రత్యేక పోలీసు బృందం అనుమానితుల కదలికలను గమనిస్తూ విచారణ చేపట్టింది. చివరకు శంఖంపల్లి ఫ్లైఓవర్ సమీపంలో ముగ్గురు మహిళా నిందితులను అదుపులోకి తీసుకుని విచారణ జరిపింది.
పోలీసుల విచారణలో అరెస్టైన నిందితులు జి.దివ్య (31), బి.రాధిక (38), బి.మేరీ (33)గా గుర్తించారు. వీరంతా చిత్తూరు జిల్లాకు చెందిన వారేనని వెల్లడించారు. నిందితుల వద్ద నుంచి సుమారు రూ.3.50 లక్షల విలువ చేసే 32 గ్రాముల బరువున్న డైమండ్ నెక్లెస్తో కూడిన బంగారు గొలుసును స్వాధీనం చేసుకున్నారు. అనంతరం వారిని కోర్టులో హాజరుపరచగా న్యాయస్థానం రిమాండ్ విధించింది.
ప్రాథమిక విచారణలో బయటపడిన వివరాలు మరింత ఆందోళన కలిగిస్తున్నాయి. నిందితులు ప్రత్యేకంగా మహిళా ప్రయాణికులనే లక్ష్యంగా ఎంచుకుని బస్సుల్లో ప్రయాణిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. బస్సుల్లో అధిక రద్దీ ఉన్న సమయాల్లో సాధారణ ప్రయాణికుల్లా ఎక్కి, ప్రయాణికుల దృష్టి మరలిన సమయంలో వారి హ్యాండ్ బ్యాగులు, నగలు, విలువైన వస్తువులను చోరీ చేస్తున్నట్లు తేలింది. ముఖ్యంగా బస్సులో ఎక్కే సమయంలో, దిగే సమయంలో ఏర్పడే రద్దీని అవకాశంగా మలుచుకుని ఈ నేరాలకు పాల్పడుతున్నట్లు పోలీసులు వెల్లడించారు.
ఈ నేపథ్యంలో మహిళా ప్రయాణికులు మరింత అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు. బస్సు ప్రయాణాల సమయంలో హ్యాండ్ బ్యాగులను ఎప్పటికప్పుడు తమ వద్ద భద్రంగా ఉంచుకోవాలని, విలువైన నగలను బహిరంగంగా ప్రదర్శించవద్దని హెచ్చరిస్తున్నారు. అనుమానాస్పదంగా వ్యవహరించే వ్యక్తులు కనిపిస్తే వెంటనే బస్సు సిబ్బందికి లేదా సమీప పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచిస్తున్నారు. పెరుగుతున్న చోరీల నేపథ్యంలో ప్రయాణికుల అప్రమత్తతే ఇలాంటి ఘటనలను అరికట్టడంలో కీలక పాత్ర పోషిస్తుందని పోలీసులు పేర్కొంటున్నారు.
ALSO RAED: Car Accident Video: అంత బలుపు ఎందుకురా..?