కాన్పూర్కు చెందిన ఫార్మా వ్యాపారి వినీత్ మనోచా హత్య కేసు దర్యాప్తులో కీలక అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న షూటర్ విశాల్ గౌతమ్.. మనోచా కుమారుడు సుబ్రత్తో పలుమార్లు ఫోన్లో మాట్లాడినట్లు పోలీసులు గుర్తించారు. దీంతో హత్య వెనుక మరింత విస్తృతమైన కుట్ర ఉందా? అనే కోణంలో దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
సెప్టెంబర్ 5న వినీత్ మనోచా హత్యకు గురయ్యారు. అయితే ఘటనకు రెండు రోజుల ముందు, సెప్టెంబర్ 3న విశాల్ గౌతమ్ కొత్త సిమ్ కార్డు తీసుకున్నట్లు పోలీసుల విచారణలో తేలింది. ఆ నంబర్ నుంచి సుబ్రత్కు ఆరుసార్లు కాల్స్ వెళ్లినట్లు కాల్ డేటా ద్వారా గుర్తించారు. ఇదే నంబర్తో మనోచా కోడలు షాలుతో కూడా విశాల్ మాట్లాడినట్లు పోలీసులు వెల్లడించారు.
హత్య కోసం ప్రత్యేకంగా తీసుకున్నట్లు భావిస్తున్న సిమ్ నుంచి సుబ్రత్కు ఎందుకు ఫోన్ కాల్స్ వెళ్లాయనే అంశాన్ని అధికారులు పరిశీలిస్తున్నారు. ఈ కేసులో ప్రతి ఫోన్ సంభాషణను విశ్లేషిస్తున్నట్లు పోలీస్ కమిషనర్ రఘుబీర్ లాల్ తెలిపారు.
మే 1 నుంచి సెప్టెంబర్ 6 వరకు సుబ్రత్, షాలు, విశాల్కు సంబంధించిన ఏడు మొబైల్ నంబర్ల కాల్ డేటాను పోలీసులు పరిశీలిస్తున్నారు. ఇందులో మే 1 నుంచి సెప్టెంబర్ 5 వరకు సుబ్రత్, విశాల్ మధ్య ఏకంగా 309 సార్లు ఫోన్ సంభాషణ జరిగినట్లు రికార్డుల్లో వెల్లడైంది.
మరోవైపు ఈ కేసులో మనోచా కోడలు షాలు, షూటర్ విశాల్ గౌతమ్, అతడి స్నేహితుడు రాజ్ కిశోర్ను పోలీసులు ఇప్పటికే అరెస్ట్ చేశారు. షాలు ఇచ్చిన సూచనల మేరకే తాను హత్య చేసినట్లు విశాల్ పోలీసులకు తెలిపినట్లు సమాచారం. ఇందుకు ప్రతిఫలంగా రూ.6 లక్షల నగదు, ఉద్యోగం ఇస్తానని షాలు హామీ ఇచ్చినట్లు అతడు వాంగ్మూలంలో పేర్కొన్నాడు.
ప్రస్తుతం షాలు, విశాల్ను కస్టడీలోకి తీసుకుని విచారించేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. వారి విచారణ పూర్తైన తర్వాత మనోచా కుమారుడు సుబ్రత్ను కూడా ప్రశ్నించే అవకాశం ఉంది. ఇదే సమయంలో ఆస్తికి సంబంధించిన పత్రాలు, 2022లో రాసిన వీలునామా, సుబ్రత్పై ఉన్న అప్పుల వివరాలను కూడా పోలీసులు పరిశీలిస్తున్నారు. ఫోన్ కాల్స్, ఆస్తి వ్యవహారాలు, నిందితుల వాంగ్మూలాలను కలిపి విశ్లేషిస్తూ హత్య వెనుక అసలు కారణాన్ని తేల్చే పనిలో అధికారులు ఉన్నారు.
also read: ఆనంద్ దేవరకొండ– వైష్ణవి చైతన్య పెళ్లి వార్తలపై క్లారిటీ.. అసలు విషయం ఇదే!
