-
కాంగ్రెస్ లో ఎమ్మెల్సీ పదవులకు విపరీతమైన పోటీ
-
బలమైన అభ్యర్థులను బరిలోకి దించేందుకు రేవంత్ ప్రణాళిక
క్రైమ్ మిర్రర్, తెలంగాణ బ్యూరో: తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికల సందడి మొదలైంది. గవర్నర్ కోటాలో 3, గ్రాడ్యుయేట్ కోటాలో 2 ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీ అవుతున్నాయి. దీంతో ఆశావహులు ఎవరి ప్రయత్నాల్లో వారు నిమగ్నమయ్యారు. సీఎం రేవంత్ దృష్టిలో పడేందుకు తంటాలు పడుతున్నారు.
అధికార కాంగ్రెస్లో విపరీతమైన పోటీ కనిపిస్తోంది. ఐదు పదవులకు గాను 50 మందికి పైగా పోటీ పడుతుండడం విశేషం. ఎవరి ప్రయత్నాల్లో వారు ఉన్నారు. హై కమాండ్ ద్వారా కొందరు.. కీలక నేతల ద్వారా మరికొందరు ఎమ్మెల్సీ పదవులు దక్కించుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.
-
నవంబర్లో పదవులు ఖాళీ..
గవర్నర్ కోటాకు సంబంధించి మూడు ఎమ్మెల్సీ పదవులు నవంబర్లో ఖాళీ అవుతున్నాయి. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీల పదవీకాలం మార్చిలో ముగియనుంది. దీంతో ఒకేసారి 5 ఎమ్మెల్సీల అభ్యర్థులను ప్రకటించాలా? ముందుగా గ్రాడ్యుయేట్ అభ్యర్థులను ప్రకటించి.. తరువాత గవర్నర్ కోటా ఎమ్మెల్సీ అభ్యర్థులను ప్రకటించాలా? అన్న విషయాన్ని కాంగ్రెస్ అధిష్టానం గట్టిగానే ఆలోచన చేస్తోంది.
సామాజిక సమీకరణలను దృష్టిలో పెట్టుకుని ఎంపిక చేయాలని చూస్తోంది. అందులో భాగంగా రెండు ఎమ్మెల్సీ పదవులను బీసీలకు, మరో రెండు ఓసీలకు, ఒక పదవి ఎస్సీలకు కానీ ఎస్టీలకు కానీ అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది.
-
సరైన అభ్యర్థులు రంగంలోకి..
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానాల్లో సరైన అభ్యర్థులను రంగంలోకి దించాలని కాంగ్రెస్ హై కమాండ్ భావిస్తోంది. సామాజిక సమీకరణల కోణంలో కాకుండా.. గెలిచే అభ్యర్థులను ప్రోత్సహించాలని ఏఐసీసీ నేతలు భావిస్తున్నారు. బిఆర్ఎస్ హయాంలో గవర్నర్ కోటాలో నామినేట్ అయ్యారు బసవరాజు సారయ్య, దయానంద్ కాంగ్రెస్ లో చేరారు. వీరిద్దరూ మరోసారి తమ పదవులను రెన్యువల్ చేయాలని కోరుతున్నారు. సీఎం రేవంత్ ను కలిసి విజ్ఞప్తి చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.
-
ఆరు జిల్లాల పరిధిలో..
గ్రాడ్యుయేట్ ఎన్నికలు ప్రతిష్టాత్మకంగా జరగనున్నాయి. ఆరు జిల్లాల పరిధిలో ఎన్నికలు జరగడంతో కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంటోంది. వరంగల్ -ఖమ్మం- నల్గొండ… మహబూబ్నగర్- రంగారెడ్డి- హైదరాబాద్ గ్రాడ్యుయేట్ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి.
తర్వాత నగరపాలక సంస్థ ఎన్నికలు రానుండడం.. అదే సమయంలో పరిషత్ ఎన్నికలపై ప్రభావం చూపనుండడంతో కాంగ్రెస్ జాగ్రత్తపడుతోంది. ఎట్టి పరిస్థితుల్లో కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులను ఓడించి గట్టి దెబ్బ తీయాలని గులాబీ పార్టీ వ్యూహరచన చేస్తోంది.
అందుకే గెలిచే అభ్యర్థులను రంగంలోకి దించాలని రేవంత్ భావిస్తున్నారు. అయితే ఐదు పదవులకు.. అధికార కాంగ్రెస్లో 50 మందికి పైగా నేతలు ఆశావహులుగా ఉండడం విశేషం.
