క్రైమ్ మిర్రర్ : ముంబై-శ్రీనగర్ మార్గంలో నడుస్తున్న ఇండిగో విమానానికి శుక్రవారం పెను ప్రమాదం తప్పింది. శ్రీనగర్ విమానాశ్రయంలో ల్యాండింగ్ అనంతరం విమానాన్ని పార్కింగ్ బేకు తరలిస్తున్న సమయంలో అక్కడ ఏర్పాటు చేసిన విజువల్ డాకింగ్ గైడెన్స్ సిస్టమ్ (VDGS) స్తంభాన్ని విమానం ఢీకొన్న ఘటన చోటుచేసుకుంది. ఈ ఘటన జరిగిన సమయంలో విమానంలో ప్రయాణికులతో పాటు సిబ్బంది కూడా ఉన్నారు. అయితే ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదని ఇండిగో సంస్థ వెల్లడించింది. అనంతరం విమానంలోని మాన్యువల్ మెట్లను ఉపయోగించి ప్రయాణికులు, సిబ్బందిని సురక్షితంగా కిందికి దించినట్లు తెలిపింది.
ఘటనపై పూర్తి స్థాయి దర్యాప్తు చేపట్టేందుకు సంస్థ విచారణకు ఆదేశించింది. దర్యాప్తు నివేదిక అందిన తర్వాత ప్రమాదానికి దారితీసిన అసలు కారణాలు వెల్లడవుతాయని ఇండిగో పేర్కొంది. కాగా, నవీ ముంబై నుంచి శుక్రవారం ఉదయం బయలుదేరిన సదరు విమానం ఉదయం 9.02 గంటలకు శ్రీనగర్ విమానాశ్రయంలో ల్యాండయింది. ఘటన జరిగినప్పటికీ శ్రీనగర్ ఎయిర్పోర్టు నుంచి విమానాల రాకపోకలకు ఎలాంటి అంతరాయం కలగలేదని అధికారులు తెలిపారు. విమాన సేవలు సాధారణంగానే కొనసాగుతున్నాయని స్పష్టం చేశారు.
also read : దారి తప్పిన బాలుడు…! స్పందించిన పోలీసులు…
