ప్రపంచ క్రీడా ప్రసార రంగంలో విప్లవాత్మక మార్పులకు నాంది పలికిన ఈఎస్పీఎన్ (ESPN) సహ వ్యవస్థాపకుడు బిల్ రాస్ముసెన్ కన్నుమూశారు. 93 ఏళ్ల వయసులో ఆయన తుదిశ్వాస విడిచారు. కొంతకాలంగా పార్కిన్సన్స్ వ్యాధితో బాధపడుతున్న ఆయన మరణించిన విషయాన్ని కుటుంబసభ్యులు వెల్లడించారు. ఆయన మృతిపై ఈఎస్పీఎన్కు చెందిన ప్రస్తుత, మాజీ ప్రతినిధులు తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు.
1970ల చివర్లో తన కుమారుడు స్కాట్ రాస్ముసెన్తో కలిసి బిల్ ఒక వినూత్న ఆలోచనకు రూపకల్పన చేశారు. రోజులో 24 గంటలూ కేవలం క్రీడలకు సంబంధించిన కార్యక్రమాలను ప్రసారం చేసే ప్రత్యేక కేబుల్ నెట్వర్క్ను ఏర్పాటు చేయాలన్నదే ఆ ఆలోచన. అప్పట్లో ఈ కాన్సెప్ట్పై అనేక అనుమానాలు వ్యక్తమైనప్పటికీ.. అదే ఆలోచన తర్వాత ప్రపంచ క్రీడా ప్రసార రంగాన్ని మార్చేసింది.
ఈ ఆలోచనకు కార్యరూపం దాల్చి 1979 సెప్టెంబర్ 7న ఈఎస్పీఎన్ ప్రసారాలను ప్రారంభించింది. ప్రారంభ దశలో ఎన్నో సవాళ్లు ఎదురైనా.. క్రమంగా ఈ సంస్థ క్రీడా ప్రసారాల్లో ప్రత్యేక గుర్తింపు సంపాదించింది. బిల్ రాస్ముసెన్ సంస్థ తొలి అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వర్తించారు.
ఈఎస్పీఎన్ ఛైర్మన్ జిమ్మీ పిటారో బిల్ రాస్ముసెన్ను గొప్ప దార్శనికుడిగా, ఆవిష్కర్తగా గుర్తు చేసుకున్నారు. క్రీడల కోసం ప్రత్యేకంగా ఒక నెట్వర్క్ ఉండాలన్న ఆలోచనకు ఆయనే పునాది వేశారని పేర్కొన్నారు. దశాబ్దాల క్రితం ఆయన చూపిన సృజనాత్మకత, క్రీడలపై ఉన్న అభిరుచి ఇప్పటికీ సంస్థలో కనిపిస్తాయని తెలిపారు.
ప్రముఖ స్పోర్ట్స్ యాంకర్ క్రిస్ బెర్మన్ కూడా రాస్ముసెన్తో తన అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు. ఆయనను గొప్ప నాయకుడిగానే కాకుండా మంచి స్నేహితుడిగా కూడా అభివర్ణించారు.
క్రీడా ప్రసార రంగానికి చేసిన విశిష్ట సేవలకు గుర్తింపుగా బిల్ రాస్ముసెన్కు 2025లో స్పోర్ట్స్ బ్రాడ్కాస్టింగ్ హాల్ ఆఫ్ ఫేమ్లో స్థానం లభించింది. ఆయనకు ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె, ఏడుగురు మనవళ్లు, ఇద్దరు మునిమనవళ్లు ఉన్నారు.
also read: చైనాకు గూగుల్ భారీ షాక్.. పిక్సెల్ తయారీకి భారత్ కీలకం!
