క్రైమ్ మిర్రర్ : బెంగళూరులో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. భర్తతో మనస్పర్థలు, ఆ తర్వాత సోషల్ మీడియా ద్వారా ఏర్పడిన పరిచయం చివరకు హత్యకు దారితీసింది. భర్తను హత్య చేయడంతో పాటు, ఆ ఘటనను చూసిన ఐదేళ్ల కుమారుడిని కూడా తల్లి హత్య చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.
భర్తకు దూరంగా ఉంటున్న మహిళ
పోలీసుల వివరాల ప్రకారం.. 2021లో హరిణికి అభినందన్తో వివాహం జరిగింది. కొంతకాలం తర్వాత ఇద్దరి మధ్య మనస్పర్థలు ఏర్పడటంతో వారు వేర్వేరుగా ఉంటున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో 2024 డిసెంబర్లో హరిణికి స్నాప్చాట్ ద్వారా వినయ్ అనే వ్యక్తితో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం క్రమంగా సన్నిహిత సంబంధంగా మారినట్లు పోలీసులు పేర్కొన్నారు. వినయ్తో కలిసి జీవించేందుకు భర్త అడ్డుగా ఉన్నాడని భావించిన హరిణి.. అతడిని హత్య చేయాలని నిర్ణయించుకున్నట్లు దర్యాప్తులో వెల్లడైనట్లు సమాచారం.
ముందస్తు ప్లాన్తో హత్య
భర్తను హత్య చేసేందుకు హరిణి, వినయ్ ముందుగానే ప్రణాళిక వేసుకున్నట్లు పోలీసులు గుర్తించారు. ఘటనకు ముందు గ్లౌజులు కొనుగోలు చేయడంతో పాటు ఇంట్లోని సీసీటీవీ కెమెరాలను ఆఫ్ చేసినట్లు తెలుస్తోంది. అనంతరం అర్ధరాత్రి సమయంలో వినయ్ను ఇంట్లోకి తీసుకెళ్లినట్లు పోలీసులు తెలిపారు. అభినందన్ గాఢ నిద్రలో ఉన్న సమయంలో వినయ్ అతడి గొంతు నులిమినట్లు, అదే సమయంలో హరిణి అతడి కాళ్లను గట్టిగా పట్టుకుని ప్రతిఘటించే అవకాశం లేకుండా చేసినట్లు దర్యాప్తులో తేలినట్లు సమాచారం. దీంతో అభినందన్ అక్కడికక్కడే మృతి చెందినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.
తల్లిని చూసిన చిన్నారి.. ఆ తర్వాత దారుణం
అయితే ఈ ఘటన జరుగుతున్న సమయంలో ఐదేళ్ల కుమారుడు నిద్రలేచి తల్లిదండ్రుల వద్దకు వచ్చినట్లు తెలుస్తోంది. జరిగిన విషయాన్ని చిన్నారి చూసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ విషయం బయటకు వస్తుందనే భయంతో హరిణి తన కుమారుడిని కూడా ఊపిరాడకుండా చేసి హత్య చేసినట్లు దర్యాప్తులో వెల్లడైనట్లు సమాచారం.
పోలీసుల విచారణలో నేరం వెలుగులోకి
హత్యల అనంతరం ఏమీ తెలియనట్లు హరిణి పోలీసులకు సమాచారం ఇచ్చినట్లు తెలుస్తోంది. అయితే ఘటనపై అనుమానాలు రావడంతో పోలీసులు ఆమెను, వినయ్ను విడివిడిగా విచారించారు. పోలీసుల విచారణలో పొంతనలేని సమాధానాలు రావడంతో మరింత లోతుగా దర్యాప్తు చేపట్టారు. చివరకు నిందితులు హత్యకు సంబంధించిన విషయాలను వెల్లడించినట్లు పోలీసులు తెలిపారు. ఘటనకు దారితీసిన కారణాలు, హత్యకు ముందు జరిగిన పరిణామాలు, నిందితుల మధ్య సంబంధానికి సంబంధించిన అంశాలపై పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
also read :ప్రహరీ గోడ కూలి విద్యార్థి మృతి….
