శేషాచలం అటవీ ప్రాంతంలో ఏనుగుల సంచారం స్థానికులను ఆందోళనకు గురిచేస్తోంది. తాజాగా ఓ ఏనుగు దాడి చేయడంతో రైతు తీవ్రంగా గాయపడిన ఘటన చంద్రగిరి మండలంలో చోటుచేసుకుంది.
మూలపల్లికి చెందిన 60 ఏళ్ల కేసుల రెడ్డి తన పొలం వద్దకు వెళ్లిన సమయంలో అక్కడికి వచ్చిన ఓ ఏనుగు అకస్మాత్తుగా ఆయనపై దాడి చేసింది. ఈ ఘటనలో రైతుకు తీవ్ర గాయాలయ్యాయి.
స్థానికులు వెంటనే స్పందించి గాయపడిన రైతును నారావారిపల్లి పీహెచ్సీకి తరలించారు. అక్కడ వైద్యులు ప్రాథమిక చికిత్స అందించిన అనంతరం మెరుగైన వైద్యం కోసం తిరుపతి రుయా ఆసుపత్రికి తరలించారు.
ప్రస్తుతం శేషాచలం అటవీ ప్రాంతంలో సుమారు 12 ఏనుగులు సంచరిస్తున్నట్లు సమాచారం. దీంతో అటవీ ప్రాంతానికి సమీపంలోని గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. పొలాల్లోకి వెళ్లే సమయంలో జాగ్రత్తలు పాటించాలని స్థానికులకు విజ్ఞప్తి చేస్తున్నారు.
also read: అయోధ్యలో ఘోర రోడ్డు ప్రమాదం.. గాల్లోకి ఎగిరిపడిన వ్యక్తి- CCTVలో దృశ్యాలు
