క్రైమ్ మిర్రర్ : ఉత్తరాఖండ్లోని చమోలీ జిల్లాలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. పిపల్కోటిలో నిర్మాణంలో ఉన్న టీహెచ్డీసీకి చెందిన హైడ్రో పవర్ ప్రాజెక్టు టన్నెల్లోకి ఒక్కసారిగా భారీగా నీరు, మట్టి, శిథిలాలు ప్రవేశించడంతో పలువురు కార్మికులు చిక్కుకుపోయారు. ఈ ఘటనలో ఇప్పటివరకు ఏడుగురు కార్మికులు ప్రాణాలు కోల్పోయినట్లు అధికారులు నిర్ధారించారు.
ప్రమాద సమయంలో టన్నెల్లో సుమారు 22 మంది కార్మికులు ఉన్నట్లు సమాచారం. సహాయక బృందాలు పలువురిని సురక్షితంగా బయటకు తీసుకువచ్చాయి. గాయపడిన వారిని సమీపంలోని ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. టన్నెల్లో చిక్కుకున్న వారి కోసం ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్తో పాటు ఇతర భద్రతా బలగాలు ముమ్మరంగా సహాయక చర్యలు చేపట్టాయి. భారీగా నీరు, బురద పేరుకుపోవడంతో రెస్క్యూ ఆపరేషన్కు ఆటంకాలు ఎదురవుతున్నాయి. ప్రత్యేక పరికరాల సాయంతో శిథిలాలను తొలగిస్తూ లోపల ఉన్న కార్మికుల కోసం గాలింపు కొనసాగిస్తున్నారు. ప్రమాదం జరిగిన వెంటనే అధికారులు ఘటనాస్థలికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. సహాయక చర్యలను వేగవంతం చేసి, టన్నెల్లో చిక్కుకున్న ప్రతి ఒక్కరినీ సురక్షితంగా బయటకు తీసుకురావడమే లక్ష్యంగా రెస్క్యూ బృందాలు పనిచేస్తున్నాయి.
also read : అమరావతిలో చారిత్రక మైలురాయి…!
