పొలం పనుల్లో నిమగ్నమైన ఓ మహిళా రైతుపై భారీ కొండచిలువ దాడి చేసిన ఘటన జనగామ జిల్లాలో కలకలం రేపింది. రఘునాథపల్లి మండలం కంచనపల్లి గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది.
స్థానికుల వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన స్వప్న అనే మహిళా రైతు బుధవారం పొలంలో పనులు చేస్తుండగా ఒక్కసారిగా సుమారు 15 అడుగుల పొడవున్న కొండచిలువ ఆమెపై దూసుకొచ్చింది. పాము ఆమెను చుట్టుముట్టి మింగేందుకు ప్రయత్నించడంతో భయంతో ఆమె పెద్దగా కేకలు వేసింది.
ఆమె అరుపులు విన్న సమీపంలోని రైతులు, వ్యవసాయ కూలీలు వెంటనే అక్కడికి చేరుకున్నారు. ప్రాణాలకు తెగించి కొండచిలువను తరిమికొట్టి స్వప్నను రక్షించారు. అనంతరం కొండచిలువను గోనె సంచిలో బంధించి, గాయపడిన మహిళను జనగామ ప్రభుత్వ జనరల్ ఆస్పత్రికి తరలించారు.
ప్రస్తుతం స్వప్న ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆమె ఆరోగ్య పరిస్థితిపై వైద్యులు పర్యవేక్షణ కొనసాగిస్తున్నారు. ఈ ఘటనతో కంచనపల్లి గ్రామంలో భయాందోళనలు నెలకొన్నాయి.
also read: పూంచ్లో ల్యాండ్మైన్ పేలుడు.. ఇద్దరు ఆర్మీ జవాన్లకు తీవ్ర గాయాలు
