ఆంధ్రప్రదేశ్లోని అనంతపురం జిల్లాలో హృదయ విదారక ఘటన వెలుగులోకి వచ్చింది. కుటుంబ విభేదాలు ఎంతటి దారుణాలకు దారి తీస్తాయో ఈ సంఘటన మళ్లీ గుర్తు చేసింది.
స్థానిక సమాచారం ప్రకారం, కుమారుడు ప్రేమ వివాహం చేసుకోవడం నచ్చక కోపం పెంచుకున్న నానమ్మ సత్యమ్మ అమానవీయ ఘటనకు పాల్పడింది. ఈ నెల 27న, ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న రెండు నెలల శిశువును చికిత్స కోసం ప్రభుత్వ సర్వజన వైద్యశాలకు తీసుకువచ్చారు. ఇదే సమయంలో ఆస్పత్రిలో ఉన్న నానమ్మ అదను చూసి శిశువును రెండో అంతస్తు పై నుంచి కిందకు విసిరేసింది.
ఈ ఘటనతో ఆస్పత్రి ప్రాంగణం ఒక్కసారిగా కలవరపాటుకు గురైంది. అయితే అదృష్టవశాత్తూ, శిశువు కాలువలో ఉన్న వాటర్ బాటిళ్లపై పడటంతో ప్రాణాపాయం తప్పింది. వెంటనే వైద్యులు చికిత్స అందించగా, ప్రస్తుతం చిన్నారి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని తెలిపారు.
సీసీ కెమెరా దృశ్యాల ఆధారంగా ఘటనను గుర్తించిన పోలీసులు, నానమ్మతో పాటు శిశువు తండ్రిని అదుపులోకి తీసుకుని విచారణ కొనసాగిస్తున్నారు. ఈ సంఘటన స్థానికంగా తీవ్ర ఆగ్రహాన్ని రేకెత్తిస్తోంది.
also read: తెరిచి ఉన్న మ్యాన్హోల్లో పడి వృద్ధుడు గల్లంతు.. కొనసాగుతున్న గాలింపు
