క్రైమ్ మిర్రర్ : కుమారుడి ప్రేమ వివాహాన్ని అంగీకరించలేని ఓ మహిళ దారుణానికి పాల్పడిన ఘటన అనంతపురంలో కలకలం రేపింది. రెండు నెలల పసికందు అయిన తన మనవరాలిని ఆసుపత్రి రెండో అంతస్తు నుంచి కిందకు పడేసినట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. అయితే అదృష్టవశాత్తూ కింద ఉన్న ఖాళీ వాటర్ బాటిళ్లపై పడటంతో చిన్నారి ప్రాణాలతో బయటపడింది. వివరాల్లోకి వెళితే.. శ్రీసత్యసాయి జిల్లా లేపాక్షి మండలం మామిడాకులపల్లికి చెందిన పూజిత, అశోక్కుమార్ ప్రేమ వివాహం చేసుకున్నారు. వీరికి రెండు నెలల ఆడ శిశువు ఉంది. చిన్నారికి ఫిట్స్ రావడంతో ఈ నెల 21న అనంతపురం ప్రభుత్వ సర్వజన వైద్యశాలకు చికిత్స కోసం తీసుకొచ్చారు.
కుమారుడు ప్రేమ వివాహం చేసుకోవడం, కోడలికి ఆడబిడ్డ జన్మించడం నచ్చకపోవడంతో నానమ్మ కొంతకాలంగా అసంతృప్తిగా ఉన్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఈ క్రమంలో ఆసుపత్రిలో ఉన్న సమయంలోనే చిన్నారిని రెండో అంతస్తు నుంచి కిందకు పడేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. వాటర్ బాటిళ్లపై పడటంతో చిన్నారికి తీవ్ర గాయాలు కాకుండా బయటపడింది. ప్రస్తుతం శిశువుకు వైద్యులు చికిత్స అందిస్తున్నారు. ఘటనపై ఆసుపత్రి అధికారులు, పోలీసులు విచారణ చేపట్టారు. పూర్తి వివరాలు దర్యాప్తులో వెల్లడికానున్నాయి.
read also : ప్రియుడితో ఫోన్లో మాట్లాడుతుండగా ఏడ్చిన కొడుకు… గొంతునులిమి హత్య చేసిన తల్లి!
