బెంగళూరు,క్రైమ్మిర్రర్: కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత సిద్ధరామయ్య ప్రత్యక్ష ఎన్నికల రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు సంచలన ప్రకటన చేశారు. 2028లో జరగబోయే కర్ణాటక శాసనసభ ఎన్నికల్లో తాను పోటీ చేయడం లేదని ఆయన స్పష్టం చేశారు. నేటి రాజకీయం తీవ్రంగా కలుషితమైందని, అవినీతిమయంగా మారిన ప్రస్తుత రాజకీయ వాతావరణంలో నిజాయితీతో కూడిన రాజకీయానికి స్థానం లేకుండా పోయిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. మండ్య జిల్లా కేఆర్ పేట్లో శనివారం జరిగిన ఓ ప్రైవేట్ కార్యక్రమంలో మాట్లాడిన ఆయన, ఆ తర్వాత సోషల్ మీడియా ద్వారా ఈ వివరాలను పంచుకున్నారు.వయస్సు పైబడటం, ఆరోగ్యం క్షీణించడం కూడా తన నిర్ణయానికి ప్రధాన కారణాలని సిద్ధరామయ్య వివరించారు.
Also Read:రామాయణ ట్రైలర్ లాంచ్ వాయిదా.. అభిమానుల్లో మరింత పెరిగిన ఆసక్తి
ప్రస్తుతం తనకు 79 ఏళ్లు ఉన్నాయని, ప్రస్తుత ప్రభుత్వ పదవీ కాలం ముగిసేసరికి తనకు 81-82 ఏళ్లు వస్తాయని పేర్కొన్నారు. గతంలో ఉన్నంత శారీరక సామర్థ్యం, ఉత్సాహంతో పని చేయడం ఇకపై సాధ్యం కాదని ఆయన తెలిపారు. వరుణ నియోజకవర్గ ప్రజలు మళ్లీ పోటీ చేయాలని తనపై ఒత్తిడి తెస్తున్నప్పటికీ, ఇకపై ఏ ఎన్నికల్లోనూ పోటీ చేయకూడదని గట్టి నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు.గత కాలపు రాజకీయాలను గుర్తుచేసుకుంటూ.. ఒకప్పుడు ఎన్నికల్లో పోటీ చేస్తే నియోజకవర్గ ప్రజలే డబ్బులు ఇచ్చి గెలిపించేవారని, కానీ నేడు గెలవాలంటే ప్రజలకే డబ్బులు పంచాల్సిన పరిస్థితులు దాపురించాయని సిద్ధరామయ్య ఆవేదన చెందారు.
Also Read:చిరంజీవి మాటలు నా కెరీర్ను మార్చేశాయి.. జనరేషన్ గ్యాప్పై రాజా రవీంద్ర ఆసక్తికర వ్యాఖ్యలు
1978లో తాలూకా బోర్డు సభ్యుడిగా ప్రారంభమైన తన 50 ఏళ్ల రాజకీయ ప్రస్థానంలో ఎన్నో గెలుపోటములను చూశానని, అయితే ఎన్నడూ తన సిద్ధాంతాలకు, అంతరాత్మకు విరుద్ధంగా ప్రవర్తించలేదనే సంతృప్తి తనకు ఉందని వ్యాఖ్యానించారు.2028 నాటికి తన రాజకీయ జీవితం అర్ధ శతాబ్దం పూర్తి చేసుకుంటుందని సిద్ధరామయ్య తెలిపారు. ఎన్నికల బరి నుంచి తప్పుకున్నప్పటికీ, రాజకీయాల్లో క్రియాశీలకంగా ఉంటూ ప్రజా సమస్యలపై తన గొంతుకను వినిపిస్తూనే ఉంటానని స్పష్టం చేశారు. గత ఐదు దశాబ్దాలుగా కర్ణాటక ప్రజలు తనను తమ కుటుంబ సభ్యుడిగా ఆదరించారని, వారి రుణం తీర్చుకోవడానికి తన శేష జీవితాన్ని ప్రజాసేవకే అంకితం చేస్తానని ఆయన స్పష్టం చేశారు. పూర్తి కాలం సీఎంగా కొనసాగాలనుకున్న ఆయనకు హైకమాండ్ షాకిచ్చింది. డీకే శివకుమార్ ను పదవిలో కూర్చోబెట్టారు
