క్రైం మిర్రర్ : ఆంధ్ర మెడికల్ కళాశాల (ఏఎంసీ)లో చదువుతున్న ఓ పోస్టు గ్రాడ్యుయేట్ వైద్య విద్యార్థి ఆత్మహత్య చేసుకోవడం తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. ఈ ఘటనతో కళాశాల విద్యార్థులు, అధ్యాపకులు దిగ్భ్రాంతికి గురయ్యారు. ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతుడు విజయవాడకు చెందిన కాశిమళ్ల ఠాగూర్నాథ్ (32)గా గుర్తించారు. ఆయన నాలుగు నెలల క్రితం ఆంధ్ర మెడికల్ కళాశాలలో ఫోరెన్సిక్ మెడిసిన్ విభాగంలో పోస్టు గ్రాడ్యుయేషన్లో చేరి, కళాశాల హాస్టల్లోనే నివాసం ఉంటున్నట్లు తెలిసింది.
ప్రాథమిక సమాచారం ప్రకారం, ఠాగూర్నాథ్ కొంతకాలంగా తీవ్ర మానసిక ఒత్తిడితో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. గతంలో కూడా రెండుసార్లు ఆత్మహత్యాయత్నం చేసినట్లు సమాచారం. అయితే కుటుంబ సభ్యులు, సహచరులు ఆయనను కోలుకునేలా ప్రోత్సహిస్తున్నప్పటికీ, మానసిక ఆందోళన నుంచి పూర్తిగా బయటపడలేకపోయినట్లు తెలుస్తోంది. శుక్రవారం ఆయన కళాశాలకు, ఆస్పత్రి విధులకు హాజరు కాకుండా హాస్టల్ గదిలోనే ఉన్నారు. పలుమార్లు ఫోన్ చేసినప్పటికీ స్పందన రాకపోవడంతో అనుమానం చెందిన సహచర విద్యార్థి మధ్యాహ్నం సమయంలో హాస్టల్ గదికి వెళ్లి చూడగా, గదిలో ఉరి వేసుకుని కనిపించినట్లు సమాచారం. అనంతరం కళాశాల యాజమాన్యానికి, పోలీసులకు సమాచారం అందించారు.
ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఘటనకు ముందు ఆయన తనకు తానే గాయాలు చేసుకున్నట్లు కూడా ప్రాథమిక విచారణలో వెల్లడైనట్లు సమాచారం. అయితే ఆత్మహత్యకు దారితీసిన అసలు కారణాలపై పోలీసులు అన్ని కోణాల్లో విచారణ చేపడుతున్నారు. ఈ ఘటనతో ఆంధ్ర మెడికల్ కళాశాలలో విషాద ఛాయలు అలుముకున్నాయి. పోస్టుమార్టం నివేదిక, కుటుంబ సభ్యుల వాంగ్మూలం, ఇతర ఆధారాల ఆధారంగా తదుపరి చర్యలు తీసుకుంటామని వన్టౌన్ పోలీసులు తెలిపారు.
also read : స్టేషన్లో కలకలం రేపిన వృద్ధుడి మృతి.. రైల్వే పోలీసుల విచారణ కొనసాగింపు
