క్రైం మిర్రర్ ; కర్ణాటకలోని దక్షిణ కన్నడ జిల్లాలో యువతి హత్య ఘటన కలకలం రేపింది. తన ప్రేమను అంగీకరించడం లేదనే కారణంతో ఓ యువకుడు యువతిపై దాడి చేసిన ఘటన బీసీ రోడ్ కేఎస్ఆర్టీసీ బస్టాండ్లో చోటుచేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. బంత్వాల్ తాలూకా పరిధిలోని బీసీ రోడ్ బస్టాండ్లో గురువారం సాయంత్రం ఈ ఘటన జరిగింది. కల్లాడ్కలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో నర్సుగా పనిచేస్తున్న లావణ్య (21) విధులు ముగించుకుని ఇంటికి వెళ్లేందుకు బస్సు ఎక్కింది.
ఈ సమయంలో కొంతకాలంగా ఆమెను ప్రేమ పేరుతో వేధిస్తున్న చేతన్ (22) అక్కడికి చేరుకున్నాడు. తన వెంట తెచ్చుకున్న కత్తితో ఆమెపై దాడి చేసినట్లు పోలీసులు తెలిపారు. దాడి నుంచి తప్పించుకునేందుకు లావణ్య బస్సు దిగి బస్టాండ్ ప్రాంగణంలోకి వెళ్లగా, నిందితుడు ఆమెను వెంబడించినట్లు సమాచారం. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన లావణ్యను ఆసుపత్రికి తరలించే ప్రయత్నం చేసినప్పటికీ, అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని కేసు నమోదు చేశారు. దాడి అనంతరం నిందితుడు ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. ప్రస్తుతం అతడిని అదుపులోకి తీసుకుని చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు విచారణలో వెల్లడికానున్నాయి.
also read : పురుషుల్లో ఈ లక్షణాలే మహిళలకు ఇష్టమట.. డేటింగ్ కోచ్ జేమీ!