సూర్యాపేట జిల్లా కేంద్రంలో మరో దారుణ హత్య చోటుచేసుకుంది. ఇంటి ముందు నిద్రిస్తున్న ఓ యువకుడిని గుర్తుతెలియని దుండగులు అత్యంత కిరాతకంగా హత్య చేయడంతో స్థానికంగా తీవ్ర కలకలం రేగింది. ఇటీవల జిల్లాలో వరుసగా హత్యలు చోటుచేసుకుంటున్న నేపథ్యంలో ఈ ఘటన ప్రజల్లో భయాందోళనలను మరింత పెంచింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టగా, హత్యకు గల కారణాలపై అన్ని కోణాల్లో విచారణ కొనసాగిస్తున్నారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సూర్యాపేట మున్సిపాలిటీ పరిధిలోని 18వ వార్డు సుందరయ్య నగర్కు చెందిన భుక్య విజయ్ (28) మంగళవారం రాత్రి తన ఇంటి ముందు నిద్రిస్తున్నాడు. ఈ సమయంలో అక్కడికి వచ్చిన గుర్తుతెలియని వ్యక్తులు అతనిపై దాడి చేసి దారుణంగా హత్య చేసినట్లు ప్రాథమిక విచారణలో తేలింది. బుధవారం ఉదయం విజయ్ రక్తపు మడుగులో పడి ఉండటాన్ని కుటుంబ సభ్యులు గమనించి వెంటనే పోలీసులకు సమాచారం అందించారు.
సమాచారం అందుకున్న సూర్యాపేట పట్టణ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని ఘటనను పరిశీలించారు. అనంతరం క్లూస్ టీమ్, ఫోరెన్సిక్ నిపుణులను రప్పించి ఘటనా స్థలం నుంచి వేలిముద్రలు, ఇతర కీలక ఆధారాలను సేకరించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం సూర్యాపేట ప్రభుత్వ ఏరియా ఆస్పత్రికి తరలించారు.
ప్రస్తుతం హత్యకు దారితీసిన కారణాలపై పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. వ్యక్తిగత కక్షలు, పాత శత్రుత్వాలు, ఆర్థిక లావాదేవీలు లేదా ఇతర వివాదాల నేపథ్యంలో ఈ హత్య జరిగిందా అనే అంశాలపై విచారణ కొనసాగుతోంది. మృతుడు భుక్య విజయ్ అక్క ఇచ్చిన ఫిర్యాదు మేరకు సూర్యాపేట టౌన్ సీఐ వెంకటయ్య కేసు నమోదు చేసి ప్రత్యేక బృందాలతో నిందితుల కోసం గాలింపు చేపట్టారు.
సంఘటన జరిగిన ప్రాంతంలోని సీసీటీవీ కెమెరాల ఫుటేజ్ను పోలీసులు పరిశీలిస్తున్నట్లు సమాచారం. హత్యకు పాల్పడిన వారిని త్వరలోనే గుర్తించి అరెస్ట్ చేస్తామని పోలీసులు తెలిపారు. ఇటీవల సూర్యాపేట జిల్లాలో వరుసగా హత్యలు చోటుచేసుకోవడంతో ప్రజలు భద్రతపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనతో సుందరయ్య నగర్లో విషాద ఛాయలు అలుముకోగా, నిందితులను త్వరగా అరెస్ట్ చేసి కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.
also read : ఒకరి తర్వాత ఒకరు.. మైనర్ బాలికపై అఘాయిత్యం