తెలంగాణలో సంచలనం సృష్టించిన నల్గొండ ఒకే కుటుంబానికి చెందిన నలుగురు హత్య కేసును పోలీసులు ఛేదించారు. దంపతులతో పాటు ఇద్దరు పిల్లలను ఒకే వ్యక్తి హత్య చేసినట్లు దర్యాప్తులో తేలింది. ఈ కేసులో ప్రధాన నిందితుడు సయ్యద్ అస్లాంను, అతడి భార్య తబస్సుమ్ తో పాటు పరోక్షంగా సహకరించిన మరో ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు.
ఇటీవల నల్గొండలోని తెలంగాణ కాలనీలో మహ్మద్ సుల్తాన్ (45), ఆయన భార్య హసీనా (38), కుమారుడు ముజామిల్ (20), కుమార్తె అఫోర (14) తమ ఇంట్లో హత్యకు గురయ్యారు. ఈ హత్యలు ఈ నెల 20వ తేదీ తెల్లవారుజామున జరిగినప్పటికీ, రెండు రోజుల తర్వాత ఈ ఘటన వెలుగులోకి వచ్చింది.
జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ తెలిపిన వివరాల ప్రకారం, ఈ ఘాతుకానికి ఆర్థిక లావాదేవీలే కారణమయ్యాయి. ఏడాది క్రితం హసీనా తన అక్క కుమార్తె తబస్సుమ్, ఆమె భర్త అస్లాంకు రూ.1 లక్ష అప్పుగా ఇచ్చారు. ఇటీవల మరో లక్ష రూపాయలు కావాలని అస్లాం బాధిత కుటుంబాన్ని అడిగాడు. అయితే హసీనా అందుకు నిరాకరించడంతో పాటు గతంలో ఇచ్చిన డబ్బు తిరిగి ఇవ్వాలని కోరింది. దీంతో అస్లాం, తబస్సుమ్ బాధితులపై పగ పెంచుకున్నారని పోలీసులు తెలిపారు. హత్యలు ఎలా చేయాలనే విషయాన్ని అస్లాం యూట్యూబ్ వీడియోలు చూసి ప్లాన్ చేసినట్లు విచారణలో బయటపడింది.
ఈ నెల 20వ తేదీ తెల్లవారుజామున ఇంటి బయటకు వచ్చిన హసీనాను అస్లాం ముందుగా హత్య చేశాడు. ఆమె అరుపులు విని బయటకు వచ్చిన సుల్తాన్, కుమారుడు ముజామిల్ను కూడా చంపేశాడు. అనంతరం ఇంట్లో ఉన్న చిన్నారి అఫ్సరాను కూడా వదల్లేదు. భయంతో మంచం కింద దాక్కున్న ఆమెను వెతికి మరీ హత్య చేసినట్లు పోలీసులు వెల్లడించారు. హత్యల అనంతరం ఇంట్లో ఉన్న నగదు, బంగారు ఆభరణాలను తీసుకుని అస్లాం అక్కడి నుంచి పరారయ్యాడు. దర్యాప్తు చేపట్టిన పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకుని కేసును ఛేదించారు.