లక్నో, క్రైమ్మిర్రర్: భారత రాజకీయాల్లో అత్యంత ప్రాధాన్యత కలిగిన ఉత్తరప్రదేశ్ లో ఎన్నికల వేడి అప్పుడే మొదలైంది. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో చారిత్రాత్మక హ్యాట్రిక్ విజయాన్ని నమోదు చేయడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ నేతృత్వంలోని భారతీయ జనతా పార్టీ కొత్త వ్యూహాలకు పదును పెడుతోంది. గతంలో లాగా కాకుండా, ఈసారి ఎన్నికలకు ముందే యోగి ఆదిత్యనాథ్ తామే సీఎం అభ్యర్థిగా బరిలోకి దిగుతారని పార్టీ జాతీయ నాయకత్వం అధికారికంగా ప్రకటించడం గమనార్హం. గత లోక్సభ ఎన్నికల్లో సమాజ్ వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ సాధించిన విజయాలకు బ్రేక్ వేయడమే కాకుండా, విపక్షాల ఓటు బ్యాంకును ముక్కలు చేసేందుకు యోగి మార్క్ పొలిటికల్ స్కెచ్ సిద్ధమైంది.
Also Read:ధారవి మారిపోతోంది! 10 లక్షల మందికి కొత్త జీవితం… ముంబైలో అతిపెద్ద రీడెవలప్మెంట్ ప్రారంభం
అఖిలేష్ యాదవ్ విస్తృతంగా ప్రచారంలోకి తెచ్చిన PDA పిచ్డే, దళిత్, అల్పసంఖ్యాక్ – వెనుకబడిన, దళిత, మైనారిటీల కూటమి ఫార్ములాను దెబ్బతీయడమే యోగి ప్రధాన ఎజెండా. దీనికోసం ఇటీవల యూపీ క్యాబినెట్ను విస్తరిస్తూ ఆరుగురు కొత్త మంత్రులతో యోగి ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ విస్తరణ వెనుక పక్కా సోషల్ ఇంజనీరింగ్ దాగి ఉంది. సమాజ్ వాదీ పార్టీ బలంగా నమ్ముకునే యాదవేతర ఓబీసీ , దళిత సామాజిక వర్గాలకు మంత్రివర్గంలో పెద్దపీట వేయడం ద్వారా అఖిలేష్ యాదవ్ ఓటు బ్యాంకు పునాదులను కదిలించేలా యోగి వ్యూహాత్మక అడుగులు వేశారు. ఎస్పీ సాంప్రదాయ ఓటు బ్యాంకు అయిన యాదవేతర వెనుకబడిన కులాలను తమ వైపు తిప్పుకోవడం ద్వారా అఖిలేష్ PDA ముసుగును తొలగించాలని యోగి ప్లాన్ చేస్తున్నారు.
Also Read:అంతరిక్షంలో కొత్త పోటీ: దక్షిణాసియాలో పెరుగుతున్న నిశ్శబ్ద “స్పేస్ వార్”
సమాజ్ వాదీ పార్టీలో యాదవుల ఆధిపత్యంపై అసంతృప్తిగా ఉన్న ఇతర ఓబీసీ ఉప-కులాలను మౌర్య, కుర్మీ, నిషాద్, రాజ్భర్ వంటి వర్గాలను బీజేపీ తన వైపు తిప్పుకుంటోంది. ఇందుకోసం చిన్న చిన్న ప్రాంతీయ పార్టీలతో పొత్తులను మరింత బలోపేతం చేయడంతో పాటు, ప్రభుత్వ సంక్షేమ పథకాలు నేరుగా ఆయా సామాజిక వర్గాల చివరి లబ్ధిదారుడికి చేరేలా యోగి స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. కుల సమీకరణాలతో పాటు రాష్ట్రాన్ని కుదిపేసే క్రైమ్, గ్యాంగ్స్టర్ సంస్కృతిని ఉక్కుపాదంతో అణచివేయడం ద్వారా శాంతిభద్రతల అంశాన్ని మరోసారి తన ప్రధాన ఆయుధంగా మలుచుకుంటున్నారు.ఇక రాజకీయంగా విపక్షాలను డిఫెన్స్లో పడేసేందుకు యోగి ఆదిత్యనాథ్ మరోసారి తన పాత వైభవమైన ‘హార్డ్ హిందుత్వ’ అస్త్రాన్ని ప్రయోగించారు. ఇటీవల కుషీనగర్, గొండాలలో జరిగిన బహిరంగ సభల్లో ఆయన నేరుగా సమాజ్ వాదీ పార్టీని రామ విరోధులు గా అభివర్ణించారు.
Also Read:మావి సైద్ధాంతిక విభేదాలే గానీ వ్యక్తిగత శత్రుత్వం కాదు- కంగనా
కాంగ్రెస్, సమాజ్ వాదీ పార్టీలు దశాబ్దాల పాటు అయోధ్య రామందిర నిర్మాణాన్ని అడ్డుకున్నాయని, 500 ఏళ్ల హిందువుల నిరీక్షణకు డబుల్ ఇంజన్ సర్కార్ మాత్రమే ముగింపు పలికిందని గుర్తు చేశారు. అఖిలేష్ యాదవ్ ఇటీవల అవలంబిస్తున్న సాఫ్ట్ హిందుత్వ పాలిటిక్స్ను యోగి తీవ్రంగా ఎండగడుతున్నారు. అభివృద్ధి జాతీయ భద్రత అనే అంశాలను కూడా యోగి ప్రజల్లోకి బలంగా తీసుకెళ్తున్నారు. ఒకప్పుడు అల్లర్లకు, మాఫియాకు కేరాఫ్ అడ్రస్గా ఉన్న ఉత్తరప్రదేశ్లో ఇప్పుడు బ్రహ్మోస్ మిసైల్ తయారీ కేంద్రాలు వస్తున్నాయని, పాకిస్తాన్ను సైతం గడగడలాడించే రక్షణ పరిశ్రమలు యూపీ గడ్డపై ఏర్పాటవుతున్నాయని ఆయన చెప్పుకొస్తున్నారు. నవ్య అయోధ్య, కాశీ విశ్వనాథ్ కారిడార్ ద్వారా పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేసి స్థానిక యువతకు ఉపాధి కల్పించామని, గతంలో జరిగిన పరీక్షల పేపర్ లీకేజీల నిందితులను జైలుకు పంపామని వివరిస్తున్నారు.
Also Read:చేపల కోసం వేస్తే మొసలి చిక్కింది
అఖిలేష్ యాదవ్ కులాల వారీగా ఓట్లను ఏకం చేసే ప్రయత్నం చేస్తుంటే.. యోగి ఆదిత్యనాథ్ మాత్రం ఆ ఓట్లను చీలుస్తూ హిందూ ఓటు బ్యాంకును ఏకం చేస్తూనే, యాదవేతర వెనుకబడిన వర్గాలను అధికారంలో భాగస్వాములను చేసే ద్వంద్వ వ్యూహాన్ని అమలు చేస్తున్నారు. గడిచిన రెండు ఎన్నికల కంటే కూడా 2027 లో యూపీ అసెంబ్లీలో భారీ మెజార్టీతో బీజేపీ తిరిగి పీఠాన్ని దక్కించుకుంటుందని యోగి ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రూరమైన పొలిటికల్ మైండ్ గేమ్లో అఖిలేష్ యాదవ్ యోగి స్పీడ్ను ఎంతవరకు తట్టుకుంటారనేది రాబోయే రోజుల్లో తేలనుంది.