బస్సులు, రైళ్లు వంటి రద్దీ ప్రదేశాల్లో మొబైల్ ఫోన్ దొంగతనాలు కొత్త విషయం కాదు. అయితే ఇప్పుడు దొంగలు కేవలం ఫోన్లను మాత్రమే దొంగిలించడం కాదు, వాటిలోని బ్యాంకింగ్ సేవలను ఉపయోగించి బాధితుల ఖాతాల్లోని డబ్బులను కూడా కాజేస్తున్న ఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయి. తాజాగా సూర్యాపేట జిల్లాలో వెలుగులోకి వచ్చిన ఘటనలో ప్రయాణికుల మొబైల్ ఫోన్లను దొంగిలించి, వాటిలోని యూపీఐ, మొబైల్ బ్యాంకింగ్ యాప్ల ద్వారా లక్షలాది రూపాయలను అక్రమంగా బదిలీ చేస్తున్న ముఠాను సీసీఎస్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఘటనతో మొబైల్ భద్రత విషయంలో ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఏర్పడింది.
పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. తుంగతుర్తి నుంచి అన్నారం వెళ్తున్న బస్సులో ప్రయాణిస్తున్న ఉప్పలయ్యకు చెందిన మొబైల్ ఫోన్ను నిందితులు చాకచక్యంగా దొంగిలించారు. అలాగే వెలుగుపల్లి నుంచి సూర్యాపేట వెళ్తున్న మరో బస్సులో దుగ్యాల వెంకటేశ్వర్లుకు చెందిన మొబైల్ ఫోన్ను కూడా అపహరించారు. ఫోన్లు చేతికి చిక్కిన వెంటనే వాటిలోని డిజిటల్ చెల్లింపు యాప్లు, మొబైల్ బ్యాంకింగ్ సేవలను తెరవడానికి ప్రయత్నించారు. బాధితులు 1234, 0000 వంటి అత్యంత సులభమైన పాస్వర్డ్లను ఉపయోగించడంతో నిందితులకు పని మరింత సులభమైంది.
సాధారణంగా ఊహించగలిగే పాస్వర్డ్లను ఉపయోగించడం వల్ల నిందితులు ఎలాంటి సాంకేతిక పరిజ్ఞానం లేకుండానే యాప్లను తెరిచి ఖాతాల్లోని డబ్బులను తమ ఖాతాలకు బదిలీ చేసుకున్నట్లు పోలీసులు గుర్తించారు. బాధితుల ఫిర్యాదు మేరకు ప్రత్యేక దర్యాప్తు చేపట్టిన సూర్యాపేట సీసీఎస్ పోలీసులు ఈ ముఠాను గుర్తించి ముగ్గురు నిందితులను అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి రూ.2.7 లక్షల నగదు, 27 స్మార్ట్ఫోన్లు, ఒక కారును స్వాధీనం చేసుకున్నారు.
ఈ ఘటనపై స్పందించిన సూర్యాపేట జిల్లా ఎస్పీ నరసింహ ప్రజలకు కీలక సూచనలు చేశారు. మొబైల్ ఫోన్ స్క్రీన్ లాక్లు, బ్యాంకింగ్ యాప్లు, యూపీఐ సేవలకు 1234, 0000, 9999 లేదా పుట్టిన సంవత్సరం వంటి సులభమైన పాస్వర్డ్లను ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపయోగించవద్దని సూచించారు. వీలైనంత వరకు వేలిముద్ర గుర్తింపు, ముఖ గుర్తింపు వంటి అధునాతన భద్రతా సదుపాయాలను తప్పనిసరిగా వినియోగించాలని కోరారు.
అలాగే మొబైల్ ఫోన్ పోయినట్లు గుర్తించిన వెంటనే ఆలస్యం చేయకుండా సిమ్ కార్డును బ్లాక్ చేయించాలని, బ్యాంకు కస్టమర్ సేవా కేంద్రాలను సంప్రదించి యూపీఐ సేవలను తాత్కాలికంగా నిలిపివేయించాలని సూచించారు. బస్సులు, రైళ్లు, మార్కెట్లు వంటి రద్దీ ప్రాంతాల్లో ప్రయాణించే సమయంలో మొబైల్ ఫోన్లను అత్యంత జాగ్రత్తగా భద్రపరుచుకోవాలని హెచ్చరించారు.
డిజిటల్ లావాదేవీలు పెరుగుతున్న ప్రస్తుత కాలంలో మొబైల్ ఫోన్ కేవలం కమ్యూనికేషన్ సాధనం మాత్రమే కాదు, వ్యక్తిగత ఆర్థిక సమాచారానికి కూడా ప్రధాన కేంద్రంగా మారింది. అందుకే చిన్న నిర్లక్ష్యం కూడా భారీ ఆర్థిక నష్టాలకు దారి తీసే ప్రమాదం ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరూ తమ మొబైల్ ఫోన్ భద్రత, బ్యాంకింగ్ యాప్ల పాస్వర్డ్ల బలంపై ఇప్పుడే ఒకసారి సమీక్షించుకోవడం అవసరమని సైబర్ నిపుణులు సూచిస్తున్నారు.
ALSO READ: Odisha Murder Case: పెళ్లి చేసుకో అన్నందుకు చంపేసి.. ప్రమాదంగా చిత్రీకరించే ప్రయత్నం చేశాడు.. కానీ..