దేశ అభివృద్ధికి రాజకీయ స్థిరత్వం, బలమైన ప్రభుత్వం ఎంతో అవసరమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ప్రధానిగా 12 సంవత్సరాలు సేవ చేసే అవకాశం ఇచ్చిన దేశ ప్రజలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. వరుసగా మూడు లోక్సభ ఎన్నికల్లో విజయం సాధించి దేశ ప్రధానిగా 12 ఏళ్లు పూర్తి చేసిన సందర్భంగా ఢిల్లీలో ఎన్డీఏ కూటమి నాయకుల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా మాట్లాడిన మోదీ, అభివృద్ధి చెందిన భారత్ నిర్మాణం ఒక్క పార్టీ, ప్రభుత్వ లక్ష్యం మాత్రమే కాదని, అది దేశ ప్రజలందరి సంకల్పంగా మారిందన్నారు. ప్రజల విశ్వాసమే తనకు బలమని, వారిని దేవుని రూపంగా భావిస్తానని చెప్పారు.
కేంద్రమంత్రి వర్గం ప్రత్యేక అభినందనలు
మోదీ ప్రధానిగా 12 ఏళ్లు పూర్తి చేయడంతో కేంద్ర మంత్రివర్గం ప్రత్యేక అభినందనలు తెలిపింది. మంత్రివర్గ సమావేశంలో ఆయనకు మంత్రులు కరతాళధ్వనులతో స్వాగతం పలికారు. దేశానికి ఆయన అందించిన సేవలను కొనియాడుతూ ప్రత్యేక తీర్మానం కూడా ఆమోదించారు. ఆర్టికల్ 370 రద్దు, జీఎస్టీ అమలు, వన్ ర్యాంక్ వన్ పెన్షన్, పౌరసత్వ సవరణ చట్టం వంటి కీలక నిర్ణయాలను ప్రభుత్వం విజయాలుగా ప్రస్తావించింది.
చంద్రబాబు అభినందన తీర్మానం
క్యాబినెట్ సమావేశం అనంతరం భారత మండపంలో జరిగిన ఎన్డీఏ సమావేశంలో భాగస్వామ్య పార్టీల నేతలు మోదీకి శాలువాలు కప్పి సత్కరించారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రత్యేకంగా అభినందన తీర్మానం ప్రవేశపెట్టగా, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్తో పాటు పలువురు నేతలు కూడా పాల్గొన్నారు. దేశవ్యాప్తంగా అమలవుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, మౌలిక సదుపాయాల ప్రాజెక్టులు, వికసిత్ భారత్ లక్ష్యాలపై సమావేశంలో చర్చ జరిగింది. ఎన్డీఏ పాలిత రాష్ట్రాలకు చెందిన ముఖ్యమంత్రులు, ఉప ముఖ్యమంత్రులు కూడా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో బెంగాల్కు చెందిన ప్రసిద్ధ చిరుతిండి ‘ఝుల్మురీ’ కూడా ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.