రామకృష్ణాపూర్, జూన్ 10 (క్రైమ్ మిర్రర్): గంజాయి వాడకం, అక్రమ రవాణాను అరికట్టేందుకు రామకృష్ణాపూర్లో పోలీసులు విస్తృత తనిఖీలు నిర్వహించారు. ముందస్తు సమాచారం మేరకు అనుమానితుల ఇళ్లలో నార్కోటిక్ డాగ్ స్క్వాడ్ సహాయంతో సోదాలు చేపట్టారు.
గంజాయి వినియోగం, విక్రయాలకు పాల్పడే వారు వెంటనే మానుకోవాలని, లేనిపక్షంలో చట్టపరమైన చర్యలు తప్పవని పట్టణ ఎస్సై జె. శ్రీధర్ హెచ్చరించారు. గంజాయి నిర్మూలన కోసం రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఈగల్ బృందం నిరంతరం నిఘా కొనసాగిస్తోందన్నారు.
ఎక్కడైనా గంజాయి వినియోగం లేదా విక్రయాలు జరుగుతున్నట్లు తెలిసినా వెంటనే పోలీసులకు సమాచారం అందించి, గంజాయి రహిత సమాజ నిర్మాణానికి సహకరించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.