క్రైమ్ మిర్రర్, ఆంధ్రప్రదేశ్:- తెలుగుదేశం పార్టీలోనూ రాజ్యసభ అభ్యర్థుల ఖరారు వ్యవహారం తీవ్ర దుమారాన్ని సృష్టిస్తోంది. రాజ్యసభ అభ్యర్థిత్వాన్ని ఆశించిన పలువురు సీనియర్ నాయకులు ఇప్పటికే మౌనముద్రలోకి వెళ్లిపోయారు. గతంలో సీటు తమకే కేటాయిస్తారని అధినేత ఇచ్చిన హామీతో ఆశపడిన ముఖ్య నాయకులు మాత్రం తీవ్రస్థాయిలో ఈ నిర్ణయం పట్ల అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. ఈ కోవలో ముందంజలో ఉంటారు కడపకు చెందిన రెడ్డప్ప గారి శ్రీనివాసరెడ్డి. గడిచిన 12 ఏళ్లుగా పార్టీ కోసం ఆయన తీవ్రస్థాయిలో కృషి చేస్తూ వస్తున్నారు. గత ఎన్నికల సమయంలోనూ కడపలో పార్టీని విజయ పాదంలో నడిపించడంలో రెడ్డప్ప గారి శ్రీనివాసరెడ్డి తో పాటు ఆయన భార్య మాధవి రెడ్డి తీవ్రంగా కృషి చేశారు. కడప ఎమ్మెల్యేగా ఆమె విజయం సాధించిన తర్వాత కూడా దూకుడుగా ముందుకు వెళుతూ వైసిపిని ఇరకాటంలో పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. అటువంటి రెడ్డప్ప గారి శ్రీనివాసరెడ్డికి రాజ్యసభ సీటు ఇస్తామని గతంలో పార్టీ అధిష్టానం హామీ ఇచ్చింది. అయితే ఇచ్చిన హామీని పార్టీ నిలబెట్టుకోకపోవడం పట్ల ఆయన తీవ్ర అసహనాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఆయన పార్టీ నిర్ణయాన్ని తప్పుపడుతూ సామాజిక మాధ్యమాల్లో ఒక పోస్ట్ పెట్టారు. ఈ పోస్ట్ ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది. తెలుగుదేశం పార్టీకి చెందిన సానుభూతిపరులు కార్యకర్తలు కూడా రెడ్డప్ప గారి శ్రీనివాసరెడ్డికి సీటు ఇచ్చి ఉంటే బాగుండేది అన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కంచుకోట అయినా కడపలో టిడిపి జెండాను ఎగరవేయడంతోపాటు వైసీపీకి పక్కలో బల్లెంల భార్యాభర్తలిద్దరూ పనిచేస్తూ ముందుకు సాగుతూ ఉండడాన్ని పలువురు గుర్తు చేస్తున్నారు. ఒకవేళ వీరిద్దరూ సైలెంట్ మూడ్లోకి వెళ్ళిపోతే ఇక్కడ పార్టీని ముందుకు తీసుకువెళ్లే నాయకులు కూడా కనిపించరని పలువురు అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.
రెడ్డప్ప గారి శ్రీనివాసరెడ్డి పెట్టిన పోస్ట్ ఏమిటంటే..
రాజ్యసభ సీటు దక్కకపోవడం పట్ల తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తూ సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టారు. ఫేస్బుక్లో పెట్టిన ఈ పోస్టులో ఏముందంటే.. ‘గత 13 సంవత్సరాలుగా కడప లాంటి అత్యంత క్లిష్టమైన రాజకీయ పరిస్థితులు ఉన్న జిల్లాలో తెలుగుదేశం పార్టీకి అండగా నిలుస్తూ, పార్టీని బలోపేతం చేయడానికి అహర్నిశలు కృషి చేశాను. రాజకీయ, ఆర్థిక, మానసిక, శారీరక ఒత్తిళ్లను ఎదుర్కొంటూ పార్టీ జెండా ఎప్పటికీ ఎగురుతూ ఉండాలనే సంకల్పంతో పని చేశాను. పార్టీ అధిష్టానం నాకు రాజ్యసభ సభ్యత్వం ఇస్తామని ఇచ్చిన హామీ నెరవేరకపోవడం వ్యక్తిగతంగా ఎంతో కలతకు గురి చేసింది. పార్టీ కోసం నిస్వార్థంగా శ్రమించిన నాయకులను, కార్యకర్తలను తగిన సమయంలో గుర్తించకపోవడం బాధాకరం. ముఖ్యంగా నాకు ఇచ్చిన మాట నిలబెట్టుకోకపోవడం నా రాజకీయ జీవితంలో అత్యంత నిరాశ కలిగించిన సంఘటనగా మిగిలిపోతుంది. కార్యకర్తల కోసం, ప్రజల కోసం, ప్రాంత అభివృద్ధి కోసం నా శక్తి మేరకు కృషి చేస్తూనే ఉంటాను’ అంటూ పోస్ట్ పెట్టారు. ఈ పోస్టు సామాజిక మాధ్యమాల్లో తెగ వైరల్ కావడంతో వెంటనే అప్రమత్తమైన తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు ఆయనకు ఫోన్ చేసి పరామర్శించారు. పార్టీ అండగా ఉంటుందని తగిన సమయంలో న్యాయం చేస్తుందని భరోసా ఇచ్చారు. అయినప్పటికీ రెడ్డప్ప గారి శ్రీనివాసరెడ్డి శాంతించినట్లు కనిపించడం లేదని ఆ పార్టీ నాయకులు చెబుతున్నారు. ఈ వ్యవహారం తీవ్ర రూపం దాల్చుతుందని భావించిన అధిష్టానం కట్టడి చర్యలను ప్రారంభించింది. ముఖ్య నాయకులతో రెడ్డప్ప గారి శ్రీనివాసరెడ్డిని సంప్రదించేలా చేసి ఆయనను శాంతింప చేసేందుకు తీవ్ర స్థాయిలో ప్రయత్నించింది. పార్టీ అధిష్టానం ఆదేశాలతో ముఖ్య నాయకులు ఆయనతో మాట్లాడి శాంతింప చేసే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలోనే ఆయన ఫేస్బుక్లో మరో పోస్ట్ పెట్టడం ప్రాధాన్యతను సంతరించుకుంది.
తాజాగా పెట్టిన పోస్టులో ‘రాజ్యసభ సభ్యుల జాబితాలో నా పేరు లేకపోవడం నాతోపాటు జిల్లాలో నన్ను అభిమానించే తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులను అందరినీ ఆవేదనకు గురిచేయడం సహజం. అందుకు మీ అందరికీ పేరు పేరునా కృతజ్ఞతలు. 13 సంవత్సరలుగా పార్టీ లో వివిధ హోదాల్లో పనిచేసినా… ఎప్పుడూ పార్టీ నిర్ణయాల మేరకే పనిచేశాను. క్రమశిక్షణ కలిగిన తెలుగుదేశం పార్టీలో అధిష్టాన నిర్ణయాన్ని గౌరవించడం అంటే మనల్ని మనం గౌరవించుకోవడమే. రాజ్యసభ సభ్యుల ఎంపిక గురించి పార్టీ ని అభిమానించే ఎవ్వరూ ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేయడం కానీ, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాలలో ఎటువంటి వ్యాఖ్యలు చేయడం వంటి కార్యక్రమాలు చేయకుండా సంయమనంతో పార్టీ విధివిధానాలను పాటించాలని మీ అందరికీ విన్నవిస్తూ ఎవరు కూడా విచక్షణ కోల్పోవద్దని కోరుతున్నాను. నేను ఎప్పటికీ మీకు అండగా వుండే మీ వాసు అన్ననే’ అంటూ ముగించారు. అంటే రెడ్డప్ప గారు శ్రీనివాసరెడ్డికి అన్యాయం జరిగిందన్న ఉద్దేశంతో పార్టీ నాయకులు ఏవైనా తీవ్ర నిర్ణయాలు తీసుకోకుండా ఉండాలన్న ఉద్దేశంతో పార్టీ అధిష్టానం ఆదేశాలతో ఆయన ఈ పోస్టు చేశారు. పార్టీ అధిష్టానం ఆదేశాలతో ఈ నిర్ణయం తీసుకున్నప్పటికీ అంతర్గతంగా ఆయన ఆయన అనుయాయులు రగిలిపోతున్నారు.