Homeరాజకీయంకర్ణాటక కాంగ్రెస్‌లో అసంతృప్తి.. మంత్రి పదవులపై నేతల్లో అసహనం.!

కర్ణాటక కాంగ్రెస్‌లో అసంతృప్తి.. మంత్రి పదవులపై నేతల్లో అసహనం.!

క్రైమ్ మిర్రర్, పాలిటిక్స్:- కర్ణాటక అధికార మార్పిడి చేసిన కాంగ్రెస్‌ పార్టీకి తలనొప్పి వ్యవహారాలు తప్పడం లేదు. సిద్ధరామయ్యను ముఖ్యమంత్రి బాధ్యతలు నుంచి తప్పించిన కాంగ్రెస్‌ పార్టీ అధిష్టానం డీకే శివ కుమార్‌ను ముఖ్యమంత్రిగా నియమించింది. ఈ ప్రక్రియ సజావుగా సాగిందని అధిష్టానం భావిస్తున్న నేపథ్యంలో అసంతృప్త నేతలు వరుసగా బయటకు వస్తున్నారు. కొద్దిరోజులు కిందట తనకు కేటాయించిన మంత్రి పదవిపై అసంతృప్తితో ఒకరు రాజీనామా చేయగా.. తాజాగా మరో ఇద్దరు అదే బాటలో తమ అసంతృప్తిని వెళ్లగక్కుతున్నారు. ఈ క్రమంలోనే ఇద్దరు సీనియర్‌ నేతలు తమకు కేటాయించిన మంత్రి పదవులను మార్చాలని కోరుతూ ఢిల్లీకి పయనమయ్యారు. వీరిలో కృష్ణ బైరేగౌడ తనకు కేటాయించిన బెంగుళూరు డవెలప్‌మెంట్‌ మంత్రి పదవిని మార్చాలంటూ ఆయన హస్తినకు పయనమయ్యారు. ఈ కీలక శాఖ నిర్వహణపై స్పష్టత లేకపోవడమే ఆయన అసంతృప్తికి కారణంగా చెబుతున్నారు. ఇప్పటికే గ్రేటర్‌ బెంగుళూరు అభివృద్ధి బాధ్యతలను సీఎం వద్దే ఉండడం, బీడీఏ, బీఎంఆర్‌డీఏ వంటి కీలక సంస్థలు కూడా ఆయన పరిధిలోనే ఉండడంతో అధికార విభజనపై గందరగోళం నెలకొన్నట్టు తెలుస్తోంది. ఈ అంశంపై అధిష్టానంతో చర్చించేందుకు ఆయన ఢిల్లీకి బయలుదేరినట్టు తెలుస్తోంది.

మరో ఎమ్మెల్యే మంతనాలు..

ఈ క్రమంలోనే ఎమ్మెల్యే రిజ్వాన్‌ అర్షద్‌ కూడా ఢిల్లీకి వెళ్లినట్టు తెలుస్తోంది. ఈయన ఢిల్లీకి పర్యటనకు వెళ్లడం ప్రాధాన్యతను సంతరించుకుంది. కేబినెట్‌ విస్తరణలో తనకు అవకాశం దక్కేలా ప్రయత్నాలను ముమ్మరం చేసే క్రమంలోనే ఆయన ఢిల్లీకి వెళుతున్నట్టు చెబుతున్నారు. డీకే శివకుమార్‌కు అత్యంత సన్నిహితుడిగా గుర్తింపు పొందిన ఆయన గతంలోనూ నాయకత్వ మార్పుపై బహిరంగంగా వ్యాఖ్యలు చేశారు. ఈ క్రమంలోనే ఆయన ఢిల్లీకి వెళ్లడంతో మంత్రి వర్గంలో చోటు కోసం తీవ్రస్థాయిలో ప్రయత్నాలు సాగిస్తున్నట్టు తెలుస్తోంది. ఇకపోతే, కేబినెట్‌ విస్తరణలో 13 మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. ఇంకా 21 స్థానాలు ఖాళీగా ఉన్నాయి. ఈ ఖాళీలను దక్కించుకునేందుకు సీనియర్‌ నేతలు తీవ్రస్థాయిలో లాబీయింగ్‌ చేస్తున్నారు. ఒక్కో శాఖ కేటాయింపే ఇప్పుడు రాజకీయ ప్రాధాన్యం పొందుతుండడంతో కాంగ్రెస్‌ పార్టీలో అంతర్గత సమీకరణాలు వేగంగా మారుతున్నట్టు తెలుస్తోంది. ఏది ఏమైనా కొత్త ప్రభుత్వం ఏర్పడిన తొలి వారాల్లోనే కర్ణాటక కేబినెట్‌ అసంతృప్తి, శాఖల పంపిణీ వివాదాలు, ఢిల్లీలాబీయింగ్‌తో ఇక్కడి రాజకీయాలు వేడెక్కాయి. ఈ వ్యవహారం ఎప్పటికి సద్దుమణుగుతుందో చూడాల్సి ఉంది.

Vengal Reddy
Vengal Reddyhttps://crimemirror.com/
2025 నుంచి "క్రైమ్ మిర్రర్" లో సీనియర్ సబ్‌ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. గత 4 ఏళ్లుగా వివిధ దినపత్రికల్లో-వెబ్ సైట్-సోషల్ మీడియా ఆప్స్' లలో కంటెంట్ క్రియేటర్ గా పని చేసిన అనుభవం ఉంది. పాలిటిక్స్‌, టెక్నాలజీ, లైఫ్‌ స్టైల్‌, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను.

తాజావార్తలు