పుణెలోని విప్రో సంస్థలో పనిచేసిన ఓ మాజీ మహిళా ఉద్యోగిని చేసిన ఆరోపణలు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారాయి. తనపై మతం మార్చుకోవాలని, ఇస్లాం మత ఆచారాలను అనుసరించాలని కార్యాలయంలోని కొందరు ఉన్నతాధికారులు ఒత్తిడి తెచ్చారని ఆమె పోలీసులకు ఫిర్యాదు చేశారు. తమ మాట వినకపోతే ఉద్యోగం నుంచి తొలగిస్తామని హెచ్చరించారని పేర్కొన్నారు.
మానవ హక్కుల సంఘాన్ని ఆశ్రయించిన బాధిత మహిళ
ప్రస్తుతం బెంగళూరులో నివసిస్తున్న ఈ మహిళ, పోలీసులతో పాటు మానవ హక్కుల కమిషన్ను కూడా ఆశ్రయించారు. 2019 నుంచి 2025 వరకు పుణెలోని విప్రో కార్యాలయంలో పనిచేసిన సమయంలో ఈ ఘటనలు జరిగాయని ఆమె ఫిర్యాదులో వెల్లడించారు. తన మత విశ్వాసాల కారణంగా కొందరు సీనియర్ మేనేజర్లు, టీమ్ లీడర్లు తనను లక్ష్యంగా చేసుకున్నారని తెలిపారు. ఇస్లాం మతంలోకి మారాలని పదేపదే ఒత్తిడి చేసేవారని, అలా చేయకపోతే సరిగా పని చేయడం లేదంటే రిపోర్టు పంపి ఉద్యోగం పోయేలా చేస్తామని బెదిరించారని చెప్పారు. ఈ పరిస్థితులతో తీవ్ర మానసిక ఒత్తిడికి గురై చివరకు ఉద్యోగానికి రాజీనామా చేయాల్సి వచ్చిందన్నారు.
విచారణ జరపుతున్న పోలీసులు
ఈ ఫిర్యాదును పోలీసులు పరిశీలిస్తున్నట్లు తెలిపారు. ఆరోపణలపై పూర్తిస్థాయిలో విచారణ జరుపుతూ, సంస్థలో జరిగిన పరిణామాలపై దృష్టి సారించినట్లు వెల్లడించారు. ఇదే సమయంలో ఆమెకు న్యాయం చేయాలంటూ జనజాగృతి సమితి పుణెలో నిర్వహించిన మీడియా సమావేశంతో ఈ అంశం మరింత ప్రాధాన్యం సంతరించుకుంది.
విప్రో కీలక ప్రకటన
మరోవైపు, తమ సంస్థలో మతపరమైన వివక్షకు లేదా ఉద్యోగుల వేధింపులకు ఎలాంటి స్థానం లేదని విప్రో ప్రతినిధి స్పష్టం చేశారు. పోలీసు దర్యాప్తుకు పూర్తిగా సహకరిస్తున్నామని, వారు కోరిన సమాచారం అందించామని తెలిపారు. అటు, నాసిక్లో జరిగిన మరో కేసులో కూడా మత ప్రచారానికి సంబంధించిన అంశాలు వెలుగులోకి వచ్చాయి. ఆ కేసులో బాధితురాలి వాంగ్మూలం ప్రకారం, కొందరు వ్యక్తులు ఇస్లామిక్ మత బోధకుల వీడియోలు చూడాలని ప్రోత్సహించేవారని పోలీసులు చార్జిషీట్ లో తెలిపారు. ఇస్లాం మతాన్ని అనుసరిస్తే మానసిక ప్రశాంతత లభిస్తుందని కూడా ఆమెకు చెప్పినట్లు దర్యాప్తులో వెల్లడైంది.