హైదరాబాద్, క్రైమ్ మిర్రర్: నగరంలో దొంగలు రెచ్చిపోతున్నారు. తాళ్లం వేసిన ఇళ్లనే టార్గెట్ చేస్తూ అందినకాడికి దోచుకెళ్తున్నారు. తాజాగా శంషాబాద్ పరిధిలోని ఘాన్సీమియాగూడాలో దొంగలు బీభత్సం సృష్టించారు. పవన్ కుమార్ అనే వ్యక్తి ఇంట్లో దొంగలు చోరీకి తెగబడ్డారు.
తాళం వేసి ఉన్న ఇంటిని టార్గెట్ చేసిన దొంగలు.. ఎవరికీ అనుమానం రాకుండా ఇంట్లో చోరీకి తెగబడ్డారు. స్థానికంగా ఉంటున్న పవన్ కుమార్ అనే వ్యక్తి ఇంట్లో దొంగలు చోరీ చేశారు. ఇంటికి తాళం వేసి పవన్ కుటుంబం స్వగ్రామానికి వెళ్లింది. ఈ విషయాన్ని గుర్తించిన దుండగులు.. రాత్రి సమయంలో తాళం పగులగొట్టి లోపలికి ప్రవేశించారు. ఇంటి లోపల ఉన్న అన్ని వస్తువులను చిందరవందర చేసి, విలువైన నగలు, నగదును అపహరించుకుపోయారు. బంగారం, వెండి ఆభరణాలతో పాటు రూ.15 వేల నగదును దుండగులు దోచుకెళ్లారు.
ఉదయం ఇంటికి తిరిగి వచ్చిన పవన్ కుమార్ కుటుంబం.. ఇంటి పరిస్థితి చూసి షాక్ అయ్యింది. ఇంట్లో చోరీ జరిగినట్లు గుర్తించిన యజమాని వెంటనే స్థానిక పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. స్వగ్రామాలకు వెళ్లే కుటుంబాలు ఇంటి భద్రతపై జాగ్రత్తగా ఉండాలని, సీసీటీవీ కెమెరాలు, సెక్యూరిటీ సిస్టమ్స్ ఏర్పాటు చేసుకోవాలని పోలీసులు సూచిస్తున్నారు.