ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర మంత్రివర్గంలో త్వరలో మార్పులు జరిగే అవకాశం ఉన్నట్టు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. మే నెల చివరి వారంలో లేదంటే జూన్ మొదటి వారంలో క్యాబినెట్ పునర్వ్యవస్థీకరణ జరిగే అవకాశాలు ఉన్నాయని విశ్వసనీయ సమాచారం వెలువడుతోంది. ఈ మార్పులకు సంబంధించిన చర్చలు ఇప్పటికే ఢిల్లీలో వేగంగా సాగుతున్నట్టు తెలుస్తోంది.
విదేశీ పర్యాట నుంచి రాగానే!
ప్రధాని మోదీ ఈ నెల 15 నుంచి 20 వరకు విదేశీ పర్యటనకు వెళ్లనున్నారు. ఆయన తిరిగి భారత్కు వచ్చిన తర్వాత ఏ రోజైనా మంత్రివర్గంలో కీలక మార్పులు ప్రకటించే అవకాశం ఉందని సమాచారం. ఈ నేపథ్యంలో కేంద్ర రాజకీయాల్లో ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ప్రధాని మోదీతో పాటు కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఇటీవల జరిగిన సమావేశాల్లో ఈ విషయాన్ని ప్రస్తావించినట్టు రాజకీయ వర్గాలు పేర్కొంటున్నాయి.
రెండేళ్ల పాలన పూర్తి అయిన నేపథ్యంలో..
2024 జూన్ 9న మోదీ మూడోసారి ప్రధానమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. రెండేళ్ల పాలన పూర్తవుతున్న సందర్భంగా ప్రభుత్వ పనితీరును మరింత బలోపేతం చేయాలనే ఉద్దేశంతోనే ఈ పునర్వ్యవస్థీకరణ చేపట్టనున్నట్టు తెలుస్తోంది. గత రెండేళ్లుగా మంత్రుల పనితీరును ప్రధాని స్వయంగా సమీక్షించినట్టు సమాచారం. పనితీరు ఆశించిన స్థాయిలో లేకపోయిన కొందరు మంత్రులను తప్పించే అవకాశముందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.
యువతకు, మహిళలకు చోటు
అదే సమయంలో కొత్త ముఖాలకు, ముఖ్యంగా యువ నాయకులు, మహిళలకు ఈసారి ఎక్కువ ప్రాధాన్యం దక్కే అవకాశం ఉందని అంటున్నారు. వచ్చే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ప్రజల్లో మంచి గుర్తింపు ఉన్న నేతలను మంత్రివర్గంలోకి తీసుకునే అవకాశముందని చర్చ జరుగుతోంది. దీంతో కేంద్ర క్యాబినెట్లో ఎవరు కొనసాగుతారు, ఎవరికీ కొత్త అవకాశాలు వస్తాయన్నదానిపై రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ నెలకొంది.