క్రైమ్ మిర్రర్, తెలంగాణ స్టేట్ బ్యూరో: హైదరాబాద్లోని అత్తాపూర్లో గంజాయి కొనుగోలుకు సంబంధించిన రూ. 700 బకాయి గొడవలో మొహమ్మద్ హుస్సేన్ అలియాస్ వసీం అనే యువకుడు దారుణంగా హత్యకు గురయ్యాడు. ఈ ఘటనకు సంబంధించి అత్తాపూర్ పోలీసులు ఎనిమిది మంది నిందితులను అరెస్ట్ చేశారు.
గంజాయి ఇప్పిస్తానని మొహమ్మద్ హుస్సేన్ అలియాస్ వసీం ప్రధాన నిందితుడు ప్రశాంత్ దగ్గర రూ. 700 తీసుకున్నాడు. అయితే వసీం గంజాయి ఇవ్వకపోగా, తీసుకున్న డబ్బులు కూడా తిరిగి ఇవ్వలేదు. ఈ క్రమంలో శనివారం రాత్రి అత్తాపూర్ రోడ్డుపై వసీం కనిపించడంతో ప్రశాంత్ అతనితో గొడవకు దిగాడు.
ఆ సమయంలో ప్రశాంత్ స్నేహితులు కూడా అక్కడికి చేరుకుని, మెటల్ నకిల్స్ (ఇనుప పంచ్లు) తో వసీం తలపై విచక్షణారహితంగా దాడి చేశారు. ఈ తీవ్ర దాడి కారణంగా వసీం అక్కడికక్కడే మరణించాడు. అనంతరం అక్కడినుండి పారిపోయారు. ఈ ఘటనలో పాలుపంచుకున్న 10 మందిలో 8 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసులో పరారీలో ఉన్న మరో ఇద్దరు నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు.
అరెస్ట్ అయిన నిందితులు: కె. ప్రశాంత్, మిట్టా జగదీష్, రామ్ రోషన్ యాదవ్, జి. తరుణ్ కుమార్, ఎ. నిఖిల్, జి. రాజ్ కుమార్, కె. వెంగళ్ రావు, ఎం. ప్రశాంత్.