క్రైమ్ మిర్రర్,తెలంగాణ:- రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర చర్చకు దారితీసిన బండి భగీరథ్ పోక్సో కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్పై నమోదైన కేసు దర్యాప్తును వేగవంతం చేస్తూ సైబరాబాద్ పోలీసులు ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్)ను ఏర్పాటు చేశారు. కూకట్పల్లి డీసీపీ రితిరాజ్ ఆధ్వర్యంలో ఈ సిట్ పనిచేయనుంది.
ఈ విషయాన్ని సైబరాబాద్ పోలీస్ కమిషనర్ రమేష్ రెడ్డి అధికారికంగా ప్రకటించారు. బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా ఇప్పటికే పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసినట్లు తెలిపారు. ఇకపై దర్యాప్తు పూర్తిగా పారదర్శకంగా జరుగుతుందని, ఎలాంటి రాజకీయ ఒత్తిళ్లకు లొంగబోమని స్పష్టం చేశారు.
మరోవైపు ఈ కేసులో కొత్త ట్విస్ట్ కూడా వెలుగులోకి వచ్చింది. బండి భగీరథ్ కూడా కరీంనగర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు సమాచారం. ఆ మైనర్ బాలిక తల్లి తనను హనీట్రాప్ చేసిందని, ఇప్పుడు అసత్య ఆరోపణలతో బ్లాక్మెయిల్ చేస్తోందని ఆయన ఆరోపించారు. తన కుటుంబ ప్రతిష్టను దెబ్బతీయడానికి పక్కా ప్రణాళిక ప్రకారం కుట్ర జరుగుతోందని ఫిర్యాదులో పేర్కొన్నట్లు తెలుస్తోంది.ఈ వ్యవహారం రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారింది. సోషల్ మీడియాలో అనేక వీడియోలు, పోస్టులు వైరల్ అవుతున్నాయి. ప్రతిపక్ష బీఆర్ఎస్ ఈ కేసులో ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై విమర్శలు చేస్తోంది. బాధితులకు న్యాయం జరగడంలో ఆలస్యం జరుగుతోందని ఆరోపిస్తోంది.
ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా స్పందించారు. కేసును పూర్తిగా విచారించి నిజానిజాలు వెలుగులోకి తేవాలని డీజీపీకి ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం. బాధితురాలికి న్యాయం జరగాలని స్పష్టం చేసిన సీఎం, ఎలాంటి ప్రభావాలకు లోనుకాకుండా విచారణ జరపాలని సూచించినట్లు తెలుస్తోంది.
ఇప్పుడు సిట్ రంగంలోకి దిగడంతో కేసు దర్యాప్తు మరింత వేగం పుంజుకునే అవకాశం కనిపిస్తోంది. ఈ కేసులో అసలు నిజాలు ఏమిటి? ఆరోపణలు ఎంతవరకు నిజం? అన్న విషయాలు రానున్న రోజుల్లో బయటపడనున్నాయి.