Himanta Biswa Sarma Submits Resignation: అస్సాం రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ తన పదవికి రాజీనామా చేశారు. బుధవారం ఆయన గువాహటిలోని లోక్ భవన్కు వెళ్లి రాష్ట్ర గవర్నర్ లక్ష్మణ్ ప్రసాద్ ఆచార్యకు రాజీనామా లేఖను అందజేశారు. ఆయనతో పాటు కేబినెట్ మంత్రులు కూడా తమ రాజీనామాలను సమర్పించారు. దీంతో రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటుకు మార్గం సుగమమైంది.
తాత్కాలిక ముఖ్యమంత్రిగా హిమంత
ఈ విషయాన్ని అస్సాం ముఖ్యమంత్రి కార్యాలయం అధికారికంగా వెల్లడించింది. గవర్నర్ రాజీనామాను ఆమోదించినప్పటికీ, కొత్త ప్రభుత్వం బాధ్యతలు చేపట్టే వరకు తాత్కాలిక ముఖ్యమంత్రిగా కొనసాగాలని హిమంత బిశ్వ శర్మను కోరినట్లు తెలిపింది. దీంతో కొత్త ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం జరిగే వరకు ప్రస్తుతం ఆయనే బాధ్యతలు నిర్వహించనున్నారు.
మే 11 తర్వాత కొత్త ముఖ్యమంత్రి ప్రమాణం
రాజీనామా అనంతరం మీడియాతో మాట్లాడిన హిమంత బిశ్వ శర్మ, మే 11 తర్వాత కొత్త ముఖ్యమంత్రి మరియు మంత్రివర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమం జరిగే అవకాశం ఉందని చెప్పారు. అస్సాంలో బీజేపీ కూటమికి చరిత్రాత్మక విజయాన్ని ప్రజలు అందించినందున, ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించాలని భావిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరుకావాలని ప్రధాని నరేంద్ర మోదీని కూడా ఆహ్వానించినట్లు వెల్లడించారు. కొత్త ముఖ్యమంత్రిని ఎంపిక చేసే ప్రక్రియ త్వరలో ప్రారంభమవుతుందని శర్మ తెలిపారు. కేంద్ర పరిశీలకుల సమక్షంలో బీజేపీ శాసనసభ పక్ష సమావేశం నిర్వహించి, ఎమ్మెల్యేలు తమ కొత్త నేతను ఎన్నుకుంటారని చెప్పారు. ఆ తర్వాత అధికారికంగా సీఎం పేరును ప్రకటించే అవకాశం ఉంది.
ఏకంగా 102 స్థానాలు గెలిచిన ఎన్డీఏ
అస్సాం అసెంబ్లీ ఎన్నికలు ఈ ఏడాది ఏప్రిల్ 9న ఒకే విడతలో జరిగాయి. మొత్తం 126 స్థానాలకు ఎన్నికలు నిర్వహించగా, మే 4న ఫలితాలు వెల్లడయ్యాయి. ఈ ఎన్నికల్లో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి భారీ విజయాన్ని సాధించింది. మొత్తం 102 స్థానాలను గెలుచుకుని మరోసారి అధికారాన్ని నిలబెట్టుకుంది. కొత్త ప్రభుత్వం ఏర్పాటుకు సంబంధించిన ప్రక్రియ ఇప్పుడు వేగంగా కొనసాగుతోంది. కొత్త సీఎం ఎవరు అవుతారనే విషయంపై రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది. అయితే పార్టీ నాయకత్వం త్వరలోనే దీనిపై తుది నిర్ణయం తీసుకునే అవకాశముంది.