పశ్చిమ బెంగాల్ షాకింగ్ ఇన్సిడెంట్ జరిగింది. బీజేపీ సీనియర్ నేత సువేందు అధికారి పీఏ చంద్రనాథ్ రథ్ దారుణ హత్యకు గురయ్యాడు. ఉత్తర 24 పరగణాల జిల్లాలోని మధ్యమ్గ్రామ్ ప్రాంతంలో జరిగింది. ఎన్నికల ఫలితాల తర్వాత ఈ ఘటన జరగడం ఆ రాష్ట్రంలో తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది.
ఇంతకీ అసలు ఏం జరిగిందంటే?
సువేందు అధికారి పీఏ చంద్రనాథ్ రథ్ తన వెహికల్ లో కూర్చుని ఉన్న సమయంలో బైక్ మీద వచ్చిన కొందరు గుర్తుతెలియని వ్యక్తులు ఆయనపై దాడి చేశారు.పాయింట్ బ్లాంక్ రేంజ్ నుంచి పలుమార్లు కాల్పులు జరిపినట్లు అధికారులు తెలిపారు. కాల్పుల్లో తీవ్రంగా గాయపడిన చంద్రనాథ్ రథ్ అక్కడికక్కడే మరణించారు.ఘటన జరిగిన వెంటనే నిందితులు అక్కడి నుంచి పారిపోయారు. సమాచారం అందుకున్న మధ్యమ్ గ్రామ్ పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని పరిసరాలను పరిశీలించారు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం సమీప ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. దుండగులను గుర్తించేందుకు సీసీటీవీ ఫుటేజ్ను పరిశీలిస్తున్నట్లు సమాచారం. రాజకీయ కోణంలో కూడా విచారణ కొనసాగిస్తున్నట్లు తెలుస్తోంది.
సువేందు అధికారి తీవ్ర దిగ్భ్రాంతికి
తనకు అత్యంత సన్నిహితంగా పనిచేసిన చంద్రనాథ్ రథ్ హత్యకు గురయ్యారని తెలిసి సువేందు అధికారి తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. ఈ ఘటనపై బీజేపీ నేతలు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రంలో ఎన్నికల ఫలితాల తర్వాత హింసాత్మక ఘటనలు పెరుగుతున్నాయని ఆరోపిస్తున్నారు.
భారీ విజయాన్ని సాధించిన బీజేపీ
ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ భారీ విజయాన్ని నమోదు చేసింది. మే 4న విడుదలైన ఫలితాల్లో పార్టీ 200కు పైగా స్థానాలు సాధించి చరిత్రాత్మక విజయం సాధించింది. ఈ విజయంతో సువేందు అధికారి ముఖ్యమంత్రి పదవి పొందే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఈ సమయంలో ఆయన వ్యక్తిగత సహాయకుడిపై జరిగిన దాడి రాజకీయంగా కూడా చర్చనీయాంశంగా మారింది. మరోవైపు పోలీసులు నిందితులను త్వరలో పట్టుకుంటామని చెబుతున్నారు. ఈ ఘటన ప్రస్తుతం పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో తీవ్ర ఉద్రిక్తతకు కారణమైంది.