Mamata Vacate CM House: పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడక ముందే ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తన అధికారిక నివాసాన్ని ఖాళీ చేసినట్లు వార్తలు రావడంతో రాజకీయ వర్గాల్లో చర్చ మొదలైంది. ఈ నిర్ణయం వెనుక అసలు కారణమేంటనే దానిపై అందరిలో ఆసక్తి నెలకొంది. ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు బీజేపీకి అనుకూలంగా ఉన్న నేపథ్యంలో, మమతా ముందుగానే పరిస్థితిని అంచనా వేసి ఈ నిర్ణయం తీసుకున్నారా అనే చర్చ సోషల్ మీడియాలో వేడెక్కుతోంది.
అందరి దృష్టి బెంగాల్ పైనే!
ఈసారి జరిగిన ఎన్నికల్లో దేశవ్యాప్తంగా అందరి దృష్టి పశ్చిమ బెంగాల్పైనే నిలిచింది. మొత్తం 294 అసెంబ్లీ స్థానాలున్న ఈ రాష్ట్రంలో 293 స్థానాలకు ఈరోజు ఫలితాలు వెలువడనున్నాయి. ఫల్టా నియోజకవర్గంలో పోలింగ్ రద్దు కావడంతో అక్కడ ఎన్నికలు తర్వాత తేదీకి వాయిదా పడ్డాయి. గత మూడు ఎన్నికల్లో వరుస విజయాలు సాధించిన తృణమూల్ కాంగ్రెస్ ఈసారి కూడా గెలుపుపై నమ్మకంగా ఉంది. నాలుగోసారి అధికారంలోకి రావాలని మమతా బెనర్జీ లక్ష్యంగా పెట్టుకున్నారు. మరోవైపు బీజేపీ ఈసారి బెంగాల్లో అధికారాన్ని సాధించేందుకు పూర్తి స్థాయిలో పోరాడింది. ఎగ్జిట్ పోల్స్ లో ఎక్కువగా బీజేపీకి అనుకూల ఫలితాలు వస్తాయని అంచనాలు వెలువడటంతో పోటీ మరింత ఉత్కంఠగా మారింది. అయితే, టీఎంసీ మాత్రం ఈ అంచనాలను ఖండిస్తూ, 200కి పైగా స్థానాల్లో గెలుస్తామని ధీమా వ్యక్తం చేస్తోంది.
భవానీపూర్ నియోజకవర్గంపై ఉత్కంఠ
ఈ ఎన్నికల్లో ప్రత్యేకంగా అందరి దృష్టి భవానీపూర్ నియోజకవర్గంపై ఉంది. ఇక్కడ మమతా బెనర్జీ పోటీ చేయగా, ఆమెకు ప్రత్యర్థిగా బీజేపీ సీనియర్ నేత సువేందు అధికారి నిలిచారు. 2021లో నందిగ్రామ్లో మమతపై విజయం సాధించిన అధికారి, ఈసారి కూడా అదే ఫలితాన్ని పునరావృతం చేస్తారా లేదా అన్నది ఆసక్తికరంగా మారింది.
పశ్చిమ బెంగాల్లో గత నెల 23, 29 తేదీల్లో రెండు విడతలుగా పోలింగ్ జరిగింది. రాష్ట్ర చరిత్రలోనే అత్యధికంగా 92 శాతానికి పైగా ఓటింగ్ నమోదైంది. ఎన్నికల అనంతరం కొన్ని ప్రాంతాల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడంతో, ఓట్ల లెక్కింపు సమయంలో భద్రతను కట్టుదిట్టం చేశారు. దాదాపు రెండున్నర లక్షల కేంద్ర బలగాలను మోహరించారు.