Assembly Election Results 2026: భారత రాజకీయాల్లో కీలక మలుపు తిప్పే ఎన్నికల ఫలితాలు కాసేపట్లో బయటపడనున్నాయి. పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కేరళ, అస్సాం, పుదుచ్చేరి రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ ఉదయం 8 గంటలకు ప్రారంభం కానుండటంతో దేశవ్యాప్తంగా ఉత్కంఠ నెలకొంది. ఈ ఫలితాలు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీకి మాత్రమే కాకుండా, కాంగ్రెస్తో పాటు ప్రాంతీయ పార్టీలకు కూడా ఎంతో ముఖ్యంగా మారాయి.
బెంగాల్ లో విజయం ఎవరిది?
పశ్చిమ బెంగాల్లో ప్రధాన పోరు తృణమూల్ కాంగ్రెస్, బీజేపీ మధ్య కొనసాగింది. ఎగ్జిట్ పోల్స్ ప్రకారం ఈసారి బీజేపీకి ఆధిక్యం లభించే అవకాశాలు ఉన్నాయని అంచనా వేయగా, టీఎంసీ మాత్రం ఈ అంచనాలను ఖండించింది. మమతా బెనర్జీ నాయకత్వంలో మరోసారి అధికారంలోకి వస్తామని పార్టీ నమ్మకంగా చెబుతోంది. ఈ గెలుపు టీఎంసీకి జాతీయ రాజకీయాల్లో కూడా బలం చేకూర్చే అవకాశం ఉంది. ఫల్టా నియోజకవర్గంలో రీపోలింగ్ జరగడంతో 294 స్థానాల్లో 293 స్థానాల కౌంటింగ్ జరుగుతోంది.
తమిళనాడులో సత్తా చాటేదెవరు?
తమిళనాడులో డీఎంకే కూటమి మరోసారి అధికారాన్ని నిలబెట్టుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని ఎగ్జిట్ పోల్స్ సూచిస్తున్నాయి. స్టాలిన్ నాయకత్వంపై ప్రజలు మళ్లీ విశ్వాసం ఉంచినట్లు అంచనాలు చెబుతున్నాయి. మరోవైపు అన్నాడీఎంకే-బీజేపీ కూటమి బలహీనంగా కనిపిస్తోందని విశ్లేషణలు చెబుతున్నాయి. అదే సమయంలో విజయ్ నేతృత్వంలోని కొత్త పార్టీ కూడా గణనీయమైన ఓట్లను సాధించే అవకాశముందని చర్చ జరుగుతోంది.
కేరళలో సీఎం పీఠం దక్కేది ఎవరికి?
కేరళలో మాత్రం పోటీ కాస్త ఆసక్తికరంగా మారింది. కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్, ఎల్డీఎఫ్ మధ్య గట్టి పోరు కొనసాగుతోంది. గత కొన్నేళ్లుగా అధికారానికి దూరంగా ఉన్న కాంగ్రెస్ ఈసారి గెలుపుపై ఆశలు పెట్టుకుంది. ఎగ్జిట్ పోల్స్ కూడా యూడీఎఫ్కే అనుకూలంగా ఉన్నాయని చెబుతున్నాయి. అయితే అధికారంలో ఉన్న ఎల్డీఎఫ్ కూడా గెలుపు కోసం బలంగా పోటీ పడుతోంది.
అస్సాంలో బీజేపీ సత్తా చాటేనా?
అస్సాంలో బీజేపీ పరిస్థితి బలంగా కనిపిస్తోంది. అక్కడి ఎగ్జిట్ పోల్స్ ప్రకారం ఎన్డీయే భారీ మెజారిటీతో తిరిగి అధికారంలోకి వచ్చే అవకాశాలు ఉన్నాయని అంచనా. పుదుచ్చేరిలో కూడా ఎన్డీయే ప్రభుత్వం తిరిగి ఏర్పడే అవకాశాలు ఉన్నాయని చెబుతున్నారు. అయినప్పటికీ కాంగ్రెస్-డీఎంకే కూటమి అక్కడ కూడా గెలుస్తామని విశ్వాసంతో ఉంది.