శ్రీకాకుళం, క్రైమ్ మిర్రర్: శ్రీకాకుళంలో జంట హత్యలు ఆ ప్రాంతంలో కలకలం రేపాయి. దీంతో గ్రామంలో విషాదం అలుముకుంది.కొత్తూరు మండలం చిన్న రాజపురం గ్రామంలో చేతబడి నెపంతో భార్యాభర్తలను దారుణంగా హత్య చేసిన ఘటన స్థానికంగా తీవ్ర సంచలనం సృష్టించింది.కాగా ఈ ప్రాంతంలో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. మృతులను సవర ఎల్లంగి, సవర గయాని గా పోలీసులు గుర్తించారు. గ్రామంలో కొంతకాలంగా చేతబడి ఆరోపణల నేపథ్యంలో ఉద్రిక్తతలు నెలకొన్నట్లు సమాచారం. ఇదే వివాదం హత్యలకు దారితీసినట్లు అనుమానిస్తున్నారు.
ఈ సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతదేహాలను స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. అలాగే సంఘటనా ప్రదేశంలో ఆధారాలు సేకరించే పనిలో నిమగ్నమయ్యారు. ఈ ఘటన అనంతరం నిందితులు పరారీలోకి వెళ్లినట్లు తెలుస్తోంది. వారిని పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడంతో పోలీసులు భద్రతా చర్యలు చేపట్టారు. కేసు నమోదు చేసిన పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు కొనసాగిస్తున్నారు.