-
ట్రెండీ లుక్ తో విదేశీ పర్యటనకు జగన్మోహన్ రెడ్డి
-
అప్పట్లో రాజశేఖర్ రెడ్డి సూట్ తో విదేశాలకు
-
ఇప్పుడు జీన్స్ తో కనిపించిన వైసిపి అధినేత
-
ఫ్యామిలీతో యూరప్ ట్రిప్
క్రైమ్ మిర్రర్, ఏపీ బ్యూరో: మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి విదేశీ పర్యటనకు వెళ్లారు. యూరప్ పర్యటనకు గాను కుటుంబ సమేతంగా వెళ్లారు. సిబిఐ ప్రత్యేక కోర్టు అనుమతితో 15 రోజులపాటు ఆయన విదేశీ పర్యటన కొనసాగించునున్నారు. బెంగళూరు విమానాశ్రయం నుంచి ఆయన బయలుదేరారు. అయితే ఆయన న్యూ లుక్ తో కనిపించారు. సాధారణ దుస్తులు కనిపించే జగన్మోహన్ రెడ్డి ఈసారి జీన్ షర్టు తో పాటు షూస్ ధరించి సరికొత్త లుక్ తో కనిపించడం విశేషం. మే 15 వరకు ఆయన విదేశీ పర్యటన కొనసాగనుంది. అటు తరువాత తిరిగి ఆయన తాడేపల్లికి చేరనున్నారు.
సీబీఐ కోర్టు అనుమతి..
జగన్మోహన్ రెడ్డి పై సిబిఐ కేసులు ఉన్నాయి. ఆయన విదేశాలకు వెళ్లాలంటే సిబి ఐ ప్రత్యేక కోర్టు అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. వ్యక్తిగత కుటుంబ అవసరాలరీత్యా తాను విదేశీ పర్యటనకు వెళ్లాలనుకుంటున్నానని ఆయన సీబీఐ ప్రత్యేక కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. విదేశీ పర్యటనకు సంబంధించి కోర్టు అనుమతి ఇచ్చింది. వాస్తవానికి ఈనెల 20 నుంచి ఆయన పర్యటన కొనసాగాల్సి ఉంది. కానీ వివిధ కారణాలతో ఆలస్యం అయింది. శనివారం రాత్రి ఆయన బెంగళూరు విమానాశ్రయం నుంచి యూరప్ దేశాలకు పయనం అయ్యారు. మే 15న ఆయన తిరిగి ఏపీకి రానున్నారు. అప్పటివరకు పార్టీ సమన్వయ బాధ్యతలను సజ్జల రామకృష్ణారెడ్డికి అప్పగించినట్లు తెలుస్తోంది.
సోషల్ మీడియాలో వైరల్..
మరోవైపు జగన్మోహన్ రెడ్డి న్యూ లుక్ సంబంధించి ఫోటోలతో పాటు వీడియోలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయ్యాయి. ఆయన డ్రెస్సింగ్ స్టైల్ అందరిని ఆశ్చర్యానికి గురిచేసింది. సాధారణంగా ఏపీలో రాజకీయ కార్యక్రమాల్లో పాల్గొన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి వైట్ షర్ట్, గోధుమ రంగు ప్యాంటు, సాధారణ చెప్పులతోనే నిరాడంబరంగా కనిపిస్తారు. కానీ ఈసారి మాత్రం ట్రెండీ లుక్ లో కనిపించారు. జీన్స్ షర్ట్, జీన్స్ ప్యాంట్, షూస్, ఖరీదైన వాచి ధరించి కనిపించారు. ఎయిర్పోర్టులోని ప్రయాణికులు, అభిమానులు ఆయనతో ఫోటోలు దిగేందుకు క్యూ కట్టారు. వాటికి సంబంధించిన ఫోటోలతో పాటు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఆ సమయంలో రాజశేఖరరెడ్డి..
గతంలో మహానేత వైయస్ రాజశేఖర్ రెడ్డి విదేశీ పర్యటనకు వెళ్లే సమయంలో కూడా ఇలాగే ట్రెండీగా కనిపించేవారు. ఏపీ రాజకీయాలతో పాటు జాతీయస్థాయిలో ఎటువంటి కార్యక్రమాల్లో పాల్గొన్న రాజశేఖర్ రెడ్డి పంచ కట్టులో కనిపించేవారు. కానీ విదేశీ పర్యటనకు వెళ్లే సమయంలో మాత్రం ఎక్కువగా షూట్ తో కనిపించి… ట్రెండీ లుక్ తో ఆకట్టుకునేవారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి సైతం తండ్రికి తగ్గట్టు ట్రెండీ లుక్ తో విదేశాలకు వెళ్లడం విశేషం. మహానేతను గుర్తుచేస్తూ జగన్మోహన్ రెడ్డిని విపరీతంగా వైరల్ చేస్తున్నారు ఆయన అభిమానులు.