-
ఆమ్ ఆద్మీ పార్టీని బిజెపిలో విలీనం
-
ఏడుగురు రాజ్యసభ సభ్యులు కాషాయ పార్టీలోకి
-
కేజ్రీవాల్ కు దారుణంగా దెబ్బతీసిన రాఘవ్ చద్దా
క్రైమ్ మిర్రర్, సెంట్రల్ డెస్క్: దేశ రాజకీయాల్లో పెను సంచలనం. బిజెపి కబలించిన పార్టీలో మరో పార్టీ చేరింది. ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన మెజారిటీ రాజ్యసభ సభ్యులు బిజెపిలో విలీనం అవుతున్నట్లు ప్రకటించారు. ఆ పార్టీలో ముదురుతున్న అంతర్గత విభేదాలు చివరకు ఆ పార్టీని అడ్డగోలుగా చీల్చాయి. ఆప్ అగ్రనేత, రాజ్యసభ ఎంపీ రాఘవ్ చద్దా శుక్రవారం మీడియా సమావేశం నిర్వహించారు. సంచలన ప్రకటన చేశారు. రాజ్యసభలో ఆప్ తరఫున ప్రాతినిధ్యం వహిస్తున్న ఏడుగురు రాజ్యసభ సభ్యులు భారత రాజ్యాంగ నిబంధనల ప్రకారం బిజెపిలో విలీనం కావాలని నిర్ణయించుకున్నట్లు ఆయన వెల్లడించారు. సందీప్ పాఠక్, అశోక్ మిట్టల్ వంటి ఎంపీలతో కలిసి ఆయన ఈ నిర్ణయాన్ని ప్రకటించడం విశేషం.
గత కొంతకాలంగా విభేదాలు..
గత కొంతకాలంగా అమ్ ఆద్మీ పార్టీలో విభేదాలు కొనసాగుతున్నాయి. ఇటీవల పతాక స్థాయికి చేరాయి. ఇటీవల పార్టీ ఎంపీ రాఘవ్ చద్దా పై వేటు వేసింది పార్టీ నాయకత్వం. ఈ క్రమంలో గత కొంతకాలంగా పట్టు బిగిస్తూ వస్తున్నారు చద్దా. ఫిరాయింపుల నిరోధక చట్టం నుంచి రక్షణ పొందేందుకు, తమ సభ్యత్వాలు కోల్పోకుండా ఉండేలా చద్దా బృందం వ్యూహాత్మకంగా వ్యవహరించింది. రాజ్యాంగంలోని 10వ షెడ్యూల్ ప్రకారం ఒక పార్టీలోని 2/3 వంతు సభ్యులు మరో పార్టీలో విలీనం అయితే వారిపై అనర్హత వేటుపడదు. ఈ మేరకు ఆ ఏడుగురు రాజ్యసభ సభ్యుల సంతకాలతో కూడిన లేఖను రాజ్యసభ చైర్మన్ కు ఇప్పటికే సమర్పించినట్లు ఆయన వెల్లడించారు.
ఆ ఏడుగురు ఎవరెవరు అంటే..
బిజెపిలో విలీనం అవుతున్న ఆప్ రాజ్యసభ సభ్యుల జాబితాలో రాఘవ్ చద్దా, సందీప్ పాఠక్, అశోక్ మిట్టల్, హర్భజన్ సింగ్, స్వాతి మలివాల్, రాజేందర్ గుప్తా, విక్రమ్ సాహ్ని ఉన్నారు. తాము ఎంతో కష్టపడి నిర్మించిన ఆమ్ ఆద్మీ పార్టీ ఇప్పుడు తన ఆశయాలకు తిలోదకాలు ఇచ్చిందని రాఘవ చద్దా ఆవేదన వ్యక్తం చేశారు. 15 ఏళ్ల రక్తాన్ని చమటను ధారపోసి పార్టీని పెంచి పోషించినట్లు చెప్పారు. ప్రస్తుతం ఆప్ తన విలువలనుంచి తప్పుకోవడం తోనే ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వంలో పనిచేసేందుకు నిర్ణయం తీసుకున్నట్లు చద్దా పేర్కొన్నారు.
క్రమేపీ బలహీనం..
జాతీయ రాజకీయాల్లో ఆమ్ ఆద్మీ ఎన్నో సంచలనాలకు వేదికగా మారింది. ఒకానొక సమయంలో కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపికి సవాల్ చేసింది. అటువంటి పార్టీ వరుసగా పరాజయాలను చవిచూస్తోంది. వైఫల్యాలను ఎదుర్కొంటోంది. తాజాగా రాజ్యసభలో పదిమంది ఎంపీలు ఉన్న ఆ పార్టీకి ఒకేసారి ఏడుగురు ఎంపీలు దూరం కావడం మాత్రం కోలుకోలేని దెబ్బ. రాజ్యసభ డిప్యూటీ లీడర్ పదవి నుంచి రాఘవ్ చద్దాను తొలగించిన కొద్ది రోజులకే ఈ పరిణామాలు ఎదుర్కోవడం గమనార్హం. అరవింద్ కేజ్రీవాల్ కు అత్యంత నమ్మకస్తులైన నేతలు బయటకు వెళ్లిపోవడం ఆయనకు సైతం ఇబ్బందికరమే. అయితే ఈ ఏడుగురు ఆప్ సభ్యుల విలీనంతో బిజెపి బలం రాజ్యసభలో పెరిగింది.