-
కొత్త పార్టీ ఆవిర్భావ సభకు భారీ ఏర్పాట్లు
-
5 లక్షల మంది జన సమీకరణ
-
జగిత్యాల సభకు ధీటుగా ఏర్పాట్లు
-
తెలంగాణ వ్యాప్తంగా భారీ హోర్డింగులు, కటౌట్లు
క్రైమ్ మిర్రర్, తెలంగాణ బ్యూరో: తెలంగాణ రాజకీయాల్లో ప్రకంపనలు రేపుతున్నారు కల్వకుంట్ల కవిత. ఈనెల 25న కొత్త పార్టీ ప్రకటించనున్న ఆమె ఏర్పాట్లను భారీ గణేష్ చేస్తున్నారు. వ్యూహాత్మక పబ్లిసిటీతో ఆమె కొత్త రాజకీయ ప్రయాణాన్ని ప్రారంభిస్తున్నారు. ఈనెల 25న మేడ్చల్ వేదికగా జరగనున్న పార్టీ ఆవిర్భావ సభకు భారీ ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు. తెలంగాణ వ్యాప్తంగా ఎక్కడ చూసినా కవిత భారీ కటౌట్లు, హోర్డింగులు కనిపించేలా చేస్తున్నారు. నేటి తరం రాజకీయాల్లో పబ్లిసిటీ పవర్ ఎలాంటిదో తెలుసు కాబట్టి కవిత వ్యూహాత్మకంగా ముందడుగు వేస్తున్నారు. తెలంగాణలో ఒక ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా చూపించాలన్న ప్రయత్నంలో ఉన్నారు ఆమె.
బలమైన ముద్ర చాటాలని..
ప్రస్తుతం తెలంగాణలో నెలకొన్న రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో తన పార్టీ అస్తిత్వం చాటుకోవడం అంత సులువు కాదని భావించారు కవిత. అందుకే మేడ్చల్ ఆవిర్భావ సభను ఒక ప్రతిష్టాత్మక వేదికగా ఎంచుకున్నారు. గతవారం జరిగిన కేసీఆర్ జగిత్యాల సభ కంటే రెట్టింపు జనాభాను సమీకరించాలని ఆమె లక్ష్యంగా పెట్టుకున్నారు. సుమారు ఐదు లక్షల మందికి పైగా జనాన్ని సమీకరించిన నియోజకవర్గాల వారీగా బాధ్యతలను అప్పగించారు. ఖర్చుకు సైతం వెనుకంజ వేయలేదు. ఈ సభ ద్వారా తన రాజకీయ సత్తాను చాటి రాష్ట్రంలో బలమైన ప్రత్యామ్నాయ శక్తిగా ఎదగాలన్నది కవిత భావన. ప్రస్తుతం తెలంగాణలో ఏ నగరంలో చూసిన కవిత హోర్డింగ్లే కనిపిస్తున్నాయి.
అంతా ఒక వ్యూహం ప్రకారం..
పార్టీ పేరు విషయంలో అత్యంత వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు కవిత. ఇప్పటివరకు పార్టీ పేరు కానీ.. జెండా రూపకల్పన కానీ లీక్ కాకుండా అత్యంత రహస్యంగా ఉంచడం కవిత వ్యూహాత్మక చాతుర్యానికి నిదర్శనం. సభా వేదికపై పేరును ప్రకటించడం ద్వారా అటు మీడియాలో, ఇటు ప్రజల్లో పెద్ద ఎత్తున చర్చ జరిగేలా ప్లాన్ చేశారు. అయితే పార్టీ భావోద్వేగాలతో కాకుండా.. పక్కా కార్యాచరణ, విధి విధానాలతో రాబోతుందని పొలిటికల్ పండితుల విశ్లేషణ. కొత్త పార్టీలో బంధుత్వాల కంటే సిద్ధాంతాలకే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తామని ఆమె సంకేతాలు పంపారు. తద్వారా తన రాజకీయ ప్రయాణం స్వతంత్రంగా ఉండబోతుందని ఆమె స్పష్టత ఇచ్చారు.
అన్ని రకాల జాగ్రత్తలు..
మరోవైపు తెలంగాణలో గులాబీ పార్టీకి ఎదురైన పరిణామాల దృష్ట్యా ఆమె చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత వ్యక్తిగత అనుబంధాల కంటే ప్రజా ప్రయోజనాలే ముఖ్యమని భావిస్తున్నారు. కెసిఆర్ అనుసరించిన విధానాలను ఆమె నేరుగా తప్పు పట్టిన సందర్భాలు కూడా ఉన్నాయి. తద్వారా తన రాజకీయ వైఖరి నిర్మొహమాటంగా ఉంటుందని అభిప్రాయాన్ని ప్రజల్లోకి పంపించారు. ఆవిర్భావ సభలో ఆమె కేవలం అధికార కాంగ్రెస్, భారతీయ జనతా పార్టీ లకు కాకుండా గులాబీ పార్టీ శ్రేణులకు కూడా బలమైన సందేశం ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. తాను తండ్రి నుంచి రాజకీయ వారసత్వం కోరుకోవడం లేదని.. తెలంగాణ అభివృద్ధి తనకు ముఖ్యమని ప్రజలకు సంకేతాలు పంపనున్నారు కల్వకుంట్ల కవిత. అయితే ఆమె ప్రయత్నాలు ఏ స్థాయిలో వర్కౌట్ అవుతాయో చూడాలి. కానీ తెలంగాణ ప్రజల్లో భారీ అంచనాలు రేపాలన్న ఉద్దేశంతో ఆవిర్భావ సభను ఒక ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు కవిత.