Billionaire Count in India: భారత్లో అత్యంత ధనవంతుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ముఖ్యంగా 30 మిలియన్ డాలర్లకు పైగా ఆస్తులు కలిగిన అత్యంత సంపన్నుల సంఖ్యలో మన దేశం ప్రపంచంలో ఆరవ స్థానంలో నిలిచింది. ప్రముఖ రియల్ ఎస్టేట్ కన్సల్టెన్సీ సంస్థ నైట్ ఫ్రాంక్ విడుదల చేసిన నివేదికలో ఈ వివరాలు వెల్లడయ్యాయి.
2026 నాటికి 19,877 మంది మిలియనీర్లు
ప్రస్తుతం 2026 నాటికి భారత్లో ఇలాంటి అధిక ఆస్తులు కలిగిన వారి సంఖ్య 19,877గా ఉంది. ఇది ప్రపంచవ్యాప్తంగా ఉన్న UHNWI జనాభాలో సుమారు 2.8 శాతం వాటాను సూచిస్తుంది. ఈ సంఖ్య రాబోయే సంవత్సరాల్లో మరింత పెరుగుతుందని అంచనా వేస్తున్నారు. 2031 నాటికి ఈ వర్గంలో ఉన్న వారి సంఖ్య దాదాపు 25,217కు చేరుతుందని నివేదిక పేర్కొంది.
భారత్ లో స్థిరంగా సంపద సృష్టి
ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక అనిశ్చితులు, ద్రవ్యోల్బణం వంటి సమస్యలు ఉన్నప్పటికీ, భారత్లో టెక్నాలజీ, పరిశ్రమలు, క్యాపిటల్ మార్కెట్లలో స్థిరంగా సంపద సృష్టి జరుగుతుండటం ఈ పెరుగుదలకు ప్రధాన కారణంగా భావిస్తున్నారు. ఇదే ధోరణి కొనసాగితే, దేశంలో సంపన్నుల సంఖ్య మరింత వేగంగా పెరిగే అవకాశముంది.
207కు చేరిన బిలియనీర్ల సంఖ్య
అలాగే, భారత్లో బిలియనీర్ల సంఖ్య కూడా గణనీయంగా పెరుగుతోంది. గత ఐదేళ్లలో ఇది 58 శాతం పెరిగి 2026 నాటికి 207కు చేరుకుంది. ఇక 2031 నాటికి ఇది మరింతగా పెరిగి 313కు చేరే అవకాశం ఉందని అంచనా. ప్రపంచ బిలియనీర్లలో భారత్ వాటా కూడా 6.7 శాతం నుంచి 8 శాతానికి పెరగనుంది.
తొలిస్థానంలో అమెరికా, రెండో స్థానంలో చైనా
ప్రస్తుతం బిలియనీర్ల సంఖ్యలో అమెరికా మొదటి స్థానంలో ఉండగా, చైనా రెండో స్థానంలో ఉంది. ఈ జాబితాలో భారత్ మూడో స్థానంలో కొనసాగుతోంది. ప్రపంచ సంపద పంపిణీలో మార్పులు చోటుచేసుకుంటున్నప్పటికీ, భారత్ నుంచి సంపన్నుల సంఖ్య పెరగడం విశేషం.